హైదరాబాద్, నవంబర్ 26 (నమస్తే తెలంగాణ): ఎమ్మెల్యేలకు ఎర కేసులో పట్టుబడిన రామచంద్రభారతి, సింహయాజి, నందకుమార్ దేశవ్యాప్తంగా లక ‘డీల్స్’లో భాగస్వామ్యులుగా ఉన్నట్టు వెలుగులోకి వస్తున్నది. న్యాయవ్యవస్థల్లో కీలక, ఉన్నత పదవులను సైతం ఈ ముఠా బేరం పెట్టినట్టు కథనాలు వస్తుండటం విస్మయానికి గురిచేస్తున్నది. ఉన్నత వ్యవస్థను సైతం బజారులో అమ్మకానికి పెట్టిన తీరుపై మేధావులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అంబర్పేటకు చెందిన ఓ న్యాయవాదికి అడిషనల్ సొలిసిటర్ జనరల్ పదవి ఇప్పిస్తామని ఈ ముఠా రూ.50 లక్షలకు ఒప్పందం చేసుకొన్నట్టు ప్రచారం జరుగుతున్నది. సొలిసిటర్ జనరల్ పదవి ఇప్పించేందుకు రూ.కోటి ఖర్చవుతుందని చెప్పినట్టు తెలిసింది. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో తాము చెప్పినట్టే జరుగుతుందని, కేంద్ర న్యాయశాఖలోనూ తమకు పలుకుబడి ఉన్నదని చెప్పుకొన్నట్టు సమాచారం. దేశ రాజధానిలో అత్యంత కీలకమైన ఢిల్లీ పోలీస్ కమిషనర్గా ఎవరు నియమితులు అవుతున్నారో కూడా అందరికంటే వారం ముందే రామచంద్రభారతికి తెలిసింది. ఆయన కాల్డాటాను విశ్లేషించగా పేరు బయటపడిన వ్యక్తి తర్వాత ఢిల్లీ పోలీస్ కమిషనర్గా ఖరారయ్యారు. ఢిల్లీలో శాంతిభద్రతలు కేంద్రం పరిధిలో ఉన్న సంగతి తెలిసిందే. లెఫ్టినెంట్ గవర్నర్ ద్వారా కేంద్రమే అక్కడ పోలీస్ కమిషనర్ను నియమిస్తుంది. దీన్నిబట్టి రామచంద్రభారతికి పెద్దస్థాయిలో సంబంధాలున్నాయని అర్థమవుతున్నది.