హైదరాబాద్, నవంబర్ 28 (నమస్తే తెలంగాణ): కెనడాలోని అంటారియో ప్రావిన్స్, తెలంగాణ రాష్ట్రం మధ్య ఆర్థిక సహకారాన్ని విస్తరించే అంశంపై సోమవారం ఢిల్లీలో ఇరుపక్షాల ప్రతినిధులు అవగాహన ఒప్పందం చేసుకొన్నారు. ఇండో-కెనడియన్ బిజినెస్ చాంబర్ (ఐసీబీసీ) వార్షికోత్సవంలో భాగంగా అంటారియో ఆర్థికాభివృద్ధి, వాణిజ్యశాఖ మంత్రి విక్ ఫెడెలీ సమక్షంలో రాష్ట్ర పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ ఎంవోయూపై సంతకం చేశారు. ఇరుపక్షాల మధ్య 2016లోనే ఎంవోయూ కుదిరింది. తాజాగా ఈవీలు, ఏరోస్పేస్, మీడియా-ఎంటర్టైన్మెంట్ వంటి ఇతర రంగాలకు సహకారాన్ని విస్తరించేందుకు ఒప్పందం చేసుకొన్నారు. టొరంటో కోలిషన్ 2023, హైదరాబాద్లో జరుగనున్న ఇండియా జాయ్ 2023 వంటి ఫ్లాగ్షిప్ కార్యక్రమాల్లో ఇరుపక్షాలు పరస్పరం సహకరించుకోవాలని నిర్ణయించారు.