నల్లగొండ : యువత ఆశల్లో నీళ్లు చల్లే అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేయాలని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ డిమాండ్ చేశారు. సోమవారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. దేశ సైనికులను బలహీన పరిచే విధంగా అగ్నిపథ్ పథకాన్ని తీసుకొచ్చారని, దీన్ని దేశవ్యాప్తంగా సైనికులు, యువత వ్యతిరేకిస్తున్నారని ఆయన గుర్తు చేశారు.
కేవలం నాలుగు సంవత్సరాలే పని చేయించుకొని ఆ తర్వాత పదవీ విరమణ ఇవ్వడం సరైంది కాదన్నారు. దేశ రక్షణ విభాగం ప్రైవేట్ పరం చేసేందుకు కేంద్రం కుట్ర చేస్తోందని ఆరోపించారు. అలాంటి పథకాన్ని ప్రధాని మోదీ తీసుకురావడం దురదృష్టకరమన్నారు. భేషజాలకు పోకుండా ఈ పథకంలో కొన్ని మార్పులు చేసి యువత కు ఉపయోగపడే విధంగా కేంద్రం చర్యలు తీసుకోవాలన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం 40 వేల కోట్ల రూపాయల విలువ చేసే భూములను కేంద్రానికి అప్పగించిందని ఆ భూములను కేంద్రం అమ్మేందుకు కుట్ర చేస్తోందని విమర్శించారు. రాష్ట్ర భూములను అమ్మే హక్కు కేంద్రానికి లేదని చెప్పారు. మోదీ తీసుకు వచ్చే పథకాలు ప్రజా వ్యతిరేకంగా ఉంటున్నాయని, గతంలో వ్యవసాయ చట్టాల తీసుకొచ్చి వెనక్కి తీసుకున్నారని గుర్తు చేశారు.
ఇప్పుడు యువతకు నష్టం చేకూర్చే విధంగా అగ్నిపథ్ పథకం తీసుకోవడం సరికాదన్నారు. రాహుల్ గాంధీపై కేంద్రం ఈడీ కేసులు పెట్టినా కాంగ్రెస్ నాయకత్వం స్పందించకపోవడం సిగ్గుచేటని అన్నారు. కేంద్రం అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను తిప్పికొట్టడం లో కాంగ్రెస్ విఫలమైందని ఆరోపించారు.
మిర్యాలగూడ మీదుగా వెళ్లే నారాయణాద్రి, నర్సాపూర్, విశాఖ, చెన్నై ఎక్స్ప్రెస్ రైళ్లను మిర్యాలగూడలో నిలుపుదల చేసేందుకు ఉన్నత అధికారులకు సిఫారసు చేసినట్లు తెలిపారు. సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ కుర్ర కోటేశ్వరరావు, చీమల మల్లయ్య యాదవ్, పెద్ది శ్రీనివాస్ గౌడ్, బాసాని గిరి, ఇలియాజ్, షోయబ్, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.