Komuravelli Mallanna | సిద్దిపేట జిల్లా( Siddipeta dist) లోని కొమరవెల్లి మల్లన్న క్షేత్రంలో ఆదివారం రాత్రి అత్యంత భక్తి శ్రద్ధలతో ఆలయ వర్గాలు అగ్నిగుండాల( Agni Gundalu ) కార్యక్రమాన్ని నిర్వహించారు. అగ్నిగుండాల కార్యక్రమానికి రాష్ట్ర నలుమూలలు నుండి భారీగా భక్తులు( Devotees ) హాజరయ్యారు. జిల్లా అడిషనల్ కలెక్టర్ శ్రీనివాసరెడ్డి సైతం అగ్నిగుండాల కార్యక్రమంలో పాల్గొని అగ్నిగుండం దాటి తన భక్తిని చాటుకున్నారు.
కొమురవెల్లి మల్లికార్జునస్వామి క్షేత్రం( Mallikarjuna Swamy Temple ) ఆదివారం భక్తులతో కిక్కిరిసింది. చివరి ఆదివారం, అగ్ని గుండాల సందర్భంగా 35 వేలకు పైగా భక్తులు తరలివచ్చినట్లు ఆలయ వర్గాలు తెలిపాయి. డిసెంబర్లో ప్రారంభమైన మల్లికార్జునుడి బ్రహ్మోత్సవాలు ఈ ఏడాది 9 వారాల పాటు కొనసాగాయి. శనివారం నుంచే భక్తులు స్వామి వారి క్షేత్రానికి చేరుకున్నారు. ఆదివారం వేకువజాము నుంచే భక్తులు పుణ్య స్నానాలు ఆచరించి స్వామి వారి దర్శనం కోసం క్యూలైన్లలో గంటల పాటు వేచి ఉన్నారు. స్వామి వారి దర్శనానికి 3 నుంచి 5 గంటల సమయం పట్టింది.
భక్తులు ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకం, అర్చనలు, చిలుక పట్నం, నజరు పట్నం, మహామండప పట్నాలు వేయించి మొక్కులు తీర్చుకున్నారు. మరికొంత మంది భక్తులు తలనీలాలు సమర్పించి, గంగరేగు చెట్టు వద్ద ముడుపులు కట్టి కోరికలు తీర్చాలని స్వామి వారిని వేడుకున్నారు. గుట్టపై భాగంలో ఉన్న ఎల్లమ్మకు బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. సాయంత్రం క్షేత్రంలో కుటుంబ సభ్యులతో పాటు షాపింగ్ చేసి, బొమ్మలు, స్వామి వారి చరిత్ర, ప్రసాదాలను కొనుగోలు చేశారు. స్వామి బ్రహ్మోత్సవాల ముగింపు సందర్భంగా నిర్వహించే అగ్నిగుండాల కార్యక్రమాన్ని కనులారా వీక్షించేందుకు మల్లన్నక్షేత్రానికి తరలివచ్చిన భక్తులు క్షేత్రంలో వేచి ఉన్నారు.
పాలక మండలి చైర్మన్ గీస భిక్షపతి, ఈవో ఏ.బాలాజీ, ధర్మకర్తలు నర్ర రఘువీరారెడ్డి, కొంగరి గిరిధర్, పచ్చిమడ్ల సిద్దిరాములు, కందుకూరి సిద్ధిలింగం, చెట్కూరి తిరుపతి, ఏఈవో వైరాగ్యం అంజయ్య, ఆలయ ప్రధానార్చకుడు మహాదేవుని మల్లికార్జున్, పర్యవేక్షకులు నీల శేఖర్, శ్రీనివాస్శర్మ, సిబ్బంది, అర్చకులు, ఒగ్గు పూజారులు సేవలందించారు. అడిషనల్ డీసీపీ మహేందర్ ఆధ్వర్యంలో హుస్నాబాద్ ఏసీపీ సతీశ్, చేర్యాల సీఐ సత్యనారాయణరెడ్డి, చేర్యాల, కొమురవెల్లి, మద్దూరు ఎస్సైలు భాస్కర్రెడ్డి, చంద్రమోహన్, నారాయణ బందోబస్తు నిర్వహించారు. కాగా, వరంగల్ నగరంలోని కొత్తవాడకు చెందిన కుమారస్వామి అనే భక్తుడు స్వామి వారికి 450 గ్రాములు వెండి కిరీటాన్ని మొక్కు రూపంలో సమర్పించాడు.