రామగుండం: తెలంగాణలోని అన్ని జిల్లాలకు ఈ నెల 27 వేల మెట్రిక్ టన్నుల యూరియాను సరఫరా చేయాలని వ్యవసాయ శాఖ సెక్రెటరీ ఎం. రఘునందన్ రావు సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం రాష్ట్ర వ్యవసాయ శాఖ సెక్రెటరీ ఎం రఘునందన్ రావు, ఫర్టిలైజర్ జేడీఏ రాములు రామగుండంలోని రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ (RFCL)ను సందర్శించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. RFCL ఉత్పత్తి చేసిన యూరియాను తెలంగాణ జిల్లాలకు సరఫరా చేయాలన్నారు. RFCL అధికారులు, మార్కెటింగ్ అధికారులతో సంయుక్తంగా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. RFCL ప్లాంట్ జూన్ నెలలో 15 రోజులు యూరియాను ఉత్పత్తి చేయలేదని, తొలకరి వానల కారణంగా జూలై, ఆగస్టు నెలల్లో యూరియా వినియోగం అధికంగా ఉంటుందని అన్నారు. ఫర్టిలైజర్ కంపెనీల నుంచి సప్లయ్ ప్లాన్ ప్రకారం యూరియాని పంపాల్సిందిగా ఆయా కంపెనీలను ఆదేశించినట్లు తెలిపారు.
RFCL యజమాన్యం కూడా జూన్ నెలలో తెలంగాణకు రావాల్సిన 27 వేల మెట్రిక్ టన్నుల ఎరువులను పంపిణీ చేస్తామని హామీ ఇచ్చింది. అనంతరం వ్యవసాయ శాఖ సెక్రెటరీ చిన్న కల్వల రైతు వేదికలో వ్యవసాయ శాఖ విస్తరణ అధికారులు, వ్యవసాయ అధికారులు, ఏడీఏలతో సమావేశం ఏర్పాటు చేసి, వ్యవసాయ శాఖ పథకాలపై ఏఈఓలో అధికారులతో చర్చించారు. ఈ కార్యక్రమంలో దోమ ఆదిరెడ్డి ఏడీఏ శ్రీనాథ్, కాంతారావు, RFCL యజమాన్యం పాల్గొన్నారు.