హైదరాబాద్, జూలై 18 (నమస్తే తెలంగాణ): రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ సందర్భంగా అసెంబ్లీలో సోమవారం మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్రావు మధ్య ఆసక్తికరమైన చర్చ జరిగింది. పోలింగ్ ముగిసిన అనంతరం బ్యాలట్ బాక్స్ను స్టోర్ రూంలో పెట్టి సీల్ చేసి వస్తున్న క్రమంలో మంత్రి ప్రశాంత్రెడ్డి, రఘునందన్రావు ఎదురుపడ్డారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య సంభాషణ ఇలా కొనసాగింది.
మంత్రి: బ్యాలట్ బాక్స్ తీసుకొని నేనే ఢిల్లీ పోదామని అనుకుంటున్నా
రఘునందన్: మీరు ఇక్కడ బయల్దేరినా ఢిల్లీలో మేమే ముందుంటాం. మీకు అనుమతి ఇవ్వం కదా..! టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఓట్లు వృథా కాబోతున్నాయి. మాకు అభినందనలు తెలపాలి.
మంత్రి : ఏం జరిగినా లెక్కింపు తర్వాత తెలుస్తుంది. అప్పుడు అభినందనలు చెబుతాం.
రఘునందన్: తెలంగాణ నుంచి మా అభ్యర్థి ద్రౌపది ముర్ముకు అనుకొన్న దాని కంటే ఎక్కువ ఓట్లే పోలయ్యాయి. క్రాస్ ఓటింగ్ జరిగిందని అనుకొంటున్నాం.
మంత్రి: తెలంగాణ నుంచి ద్రౌపది ముర్ముకు ఒక్క ఓటే పడింది. మిగిలిన ఇద్దరు ఆత్మప్రభోదానుసారం ఓటు వేశారు.
రఘునందన్: మంత్రి ప్రశాంత్రెడ్డి మంచివారే.. కాకపోతే అప్పుడప్పుడూ లెక్కలు మరిచిపోతుంటారు.. అని సరదాగా మాట్లాడుకుంటూ వెళ్లిపోయారు.