హైదరాబాద్, ఏప్రిల్ 12 (నమస్తే తెలంగాణ): సమైక్య రాష్ట్రంలో అత్యంత తీవ్రంగా చితికిపోయిన వ్యవసాయ రంగాన్ని పునరుజ్జీవింపజేసేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం అనేక ఉద్దీపనలు ప్రకటించిందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు చెప్పారు. ఈ ఉద్దీపనలు ఉత్తమ ఫలితాలనిచ్చాయన్నారు. మంత్రివర్గ సమావేశం అనంతరం మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వ్యవసాయ రంగ అభివృద్ధికి తమ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను వివరించారు. ‘ఉమ్మడి రాష్ట్రంలో మైనర్ ఇరిగేషన్ ధ్వంసమైంది. ప్రాజెక్టులను దశాబ్దాల తరబడి పెండింగ్లో పెట్టారు. దీంతో తెలంగాణ రైతాంగానికి భూగర్భజలాలే దిక్కయ్యాయి. కరువులు, కాటకాలతో గ్రామీణ ముఖచిత్రం చెల్లాచెదురయ్యింది. రైతుల ఆత్మహత్యలు, ఆకలిచావులు జరిగినయి. ప్రాజెక్టులు పూర్తికాక, కాల్వల ద్వారా నీళ్లు రాక, 600 నుంచి 900 ఫీట్ల కింది నుంచి భూగర్భజలాలు తీసుకోవడానికి కరెంట్ లేక వేల సంఖ్యలో మోటర్లు కాలిపోవడం, పంటలు ఎండిపోయిన బాధాకరమైన దృశ్యాలు కండ్లారా చూసినం’ అని చెప్పారు.
విద్యుత్తురంగాన్ని అద్భుతంగా తయారుచేసి, అన్ని రంగాలకు 24 గంటల క్లీన్ ఎనర్జీ అందించడంలో గొప్ప విజయం సాధించామని కేసీఆర్ చెప్పారు. 2023 చివరి కల్లా యాదాద్రి ద్వారా నాలుగు వేలు, ఎన్టీపీసీ నిర్మించిన 1600 మెగావాట్ల విద్యుత్తుతో మొత్తంగా 5600 మెగావాట్ల విద్యుత్తు అదనంగా అందుబాటులోకి వస్తుందని చెప్పారు. విద్యుత్తు పంపిణీలో అసమానతలను తొలగించి, కోతలు, లోవోల్జేజీ లేకుండా విద్యుత్తునందిస్తున్నామని తెలిపారు. వీటన్నింటితో వ్యవసాయ విస్తరణ జరిగిందని, గొప్ప పంటలకు తెలంగాణ అలవాలమైందని అన్నారు. ఆన్గోయింగ్ పెండింగ్ ప్రాజెక్ట్లను త్వరగా పూర్తిచేయడం, ప్రపంచం అబ్బురపడే విధంగా మిషన్ కాకతీయ పూర్తిచేయడం, ప్రాజెక్ట్ల రీ ఇంజినీరింగ్తో కాళేశ్వరం వంటి మల్టీ స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ను రికార్డు టైంలో పూర్తిచేయడంతో దాని ఫలితాలు అందుతున్నాయని చెప్పారు. భగవంతుడి దయవల్ల వర్షపాతం తోడయ్యిందన్నారు. వీటికి తోడు ప్రభుత్వం అందించిన ఉద్దీపనలు మేలు చేశాయన్నారు. ఇండియాలోనే కాదు.. భూగోళం మీదనే రైతులకు ఎకరానికి 10వేలు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని సీఎం కేసీఆర్ స్పష్టంచేశారు.
వ్యవసాయరంగాన్ని పునరుజ్జీవింపజేసేందుకు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టి కోసం పకడ్బందీ ప్రణాళికలు రూపొందించామని కేసీఆర్ చెప్పారు. అద్భుత ఫలితాలు సాధించే దిశగా ఉద్దీపనలు సమకూర్చామన్నారు. దీంట్లో భాగంగా చేపట్టిన మిషన్ కాకతీయ పథకం అద్భుత ఫలితానిచ్చిందని తెలిపారు. ఈ విషయాన్ని కేంద్ర జల వనరులశాఖ ధ్రువీకరించిందని, దేశంలో అత్యధికంగా భూగర్భజలాలు పెంచిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పిందని గుర్తుచేశారు.
గతంలో ఉన్న నీటితీరువా బకాయిలు రూ.500 కోట్లు రద్దుచేసి, కొత్తగా ఒక్క రూపాయి తీసుకోకుండా ఉచితంగా సాగునీరు అందిస్తున్నామని కేసీఆర్ చెప్పారు. ఇలా ఉచితంగా నీరందిస్తున్న రాష్ట్రం తెలంగాణేనని, ప్రధానమంత్రి రాష్ట్రం గుజరాత్లో కూడా ఇవ్వడంలేదని అన్నారు. రైతులు చనిపోతే 8 రోజులు దాటకుండానే రైతుబీమాను అందజేస్తున్నామని చెప్పారు. దీనికి ప్రీమియం కూడా రాష్ట్ర ప్రభుత్వమే కడుతున్నదని తెలిపారు. భారత దేశ చరిత్రలో తొలిసారిగా ఏ గ్రామానికి ఆ గ్రామంలో ఏడు వేల పైచిలుకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యాన్ని కొనుగోలు చేశామని చెప్పారు. రైతులకు మూడు రోజుల్లోనే డైరెక్ట్గా బ్యాంక్ ఖాతాల్లో ధాన్యం డబ్బులు జమచేశామన్నారు. విద్యుత్తు, నీళ్లు, కల్తీలేని విత్తనాలు, ఎక్కడిక్కక్కడ కొనుగోళ్లు, ఖాతాల్లో డబ్బులు జమ కావడంతో రైతులు అద్భుతంగా ధాన్యం పండిస్తున్నారని సీఎం గుర్తుచేశారు. 2015 నుంచి 22 వరకు కోటి పైచిలుకు ఎకరాల విస్తీర్ణం పెరిగి రాష్ట్రంలో బ్రహ్మాండంగా పంటలు పండుతున్నాయని చెప్పారు.