భద్రాద్రి: భద్రాచలంలోని శ్రీ రామచంద్ర స్వామివారి సన్నిధిలో వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ నెల 23 వరకు ముక్కోటి ఏకాదశి మహోత్సవాలు జరగనున్నాయి. ఇందులో భాగంగా స్వామివారు రోజుకో రూపంలో దర్శనమిస్తున్నారు. ఏడోరోజైన నేడు శ్రీరామ అవతారంలో నిజరూపంలో రామచంద్రుడు భక్తులకు దర్శనమివ్వనున్నారు. లక్ష్మణ సమేత సీతారాములకు వేదపండితులు తిరుమంజనం నిర్వహించారు.
ఉత్సవాల్లో భాగంగా రేపు బలరామావతారంలో స్వామివారు కనిపించనున్నారు. ఈ నెల 11న శ్రీకృష్ణావతారంలో దర్శనమిస్తారు. 12న ఆయలం లోపల స్వామివారి తెప్పోత్సవం నిర్వహిస్తారు. ఈ నెల 13న ఉత్తర ద్వార దర్శనం ఉంటుంది. వేడుకల్లో భాగంగా స్వామివారి నిత్య కల్యాణాలను అధికారులు రద్దు చేశారు.
కాగా, తెప్పోత్సవం, ఉత్తర ద్వార దర్శనానికి భక్తులకు అధికారులు అనుమతి నిరాకరించారు. మరోమారు కరోనా వైరస్ విజృంభిస్తుండటంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. దీంతో ఏకాంతంగా ఉత్సవాలు నిర్వహిస్తున్నారు.