హైదరాబాద్, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ): టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఎర కేసులో న్యాయవాది పోగులకొండ ప్రతాప్గౌడ్, నందకుమార్ భార్య చిత్రలేఖ శుక్రవారం బంజారాహిల్స్లోని కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లోని సిట్ కార్యాలయంలో జరిగిన దర్యాప్తునకు హాజరయ్యారు. ప్రతాప్గౌడ్ను సిట్ అధికారులు ఉదయం 11 నుంచి ఏడు గంటలపాటు సుదీర్ఘంగా ప్రశ్నించినట్టు మీడియాలో కథనాలు వచ్చాయి. కేంద్ర మంత్రి కిషన్రెడ్డితో సన్నిహిత సంబంధాలు ఉండటంతోపాటు ఈ కేసులో ఇప్పటికే అరెస్టయిన నందకుమార్లో సత్సంబంధాలు కలిగి ఉన్నట్టు కీలక ఆధారాలు లభించడంతో ప్రతాప్గౌడ్ను సిట్ అధికారులు విచారణకు పిలిచినట్టు మీడియా వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది.
ఎమ్మెల్యేల కొనుగోళ్ల వ్యవహారంలోనూ నందకుమార్తో కలిసి పలుమార్లు చర్చల్లో ప్రతాప్గౌడ్ పాల్గొన్నట్టు ఆధారాలు లభించినట్టు మీడియా వర్గాల ద్వారా తెలిసింది. శనివారం సైతం ప్రతాప్గౌడ్ను మరోసారి విచారణకు రావాల్సిందిగా సిట్ అధికారులు సూచించినట్టు సమాచారం. సోమవారం మరోమారు దర్యాప్తునకు హాజరుకావాల్సిందిగా చిత్రలేఖకు సిట్ అధికారులు సూచించినట్టు తెలిసింది. శుక్రవారం సిట్ దర్యాప్తునకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అనుచరుడు, కరీంనగర్కు చెందిన న్యాయవాది శ్రీనివాస్ హాజరుకావాల్సి ఉండగా, అనారోగ్య కారణాలతో రాలేదని సమాచారం.