ఏర్పాటుకు ముందుకొచ్చిన కంపెనీ
అడోబి, ఓయూ మధ్య ఒప్పందం
వీసీ ప్రొఫెసర్ రవీందర్ వెల్లడి
హైదరాబాద్ సిటీ బ్యూరో, జూన్ 10 (నమస్తే తెలంగాణ)/ఉస్మానియా యూనివర్సిటీ: అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అడోబి రిసెర్చ్ అండ్ ట్రైనింగ్ కేంద్రాన్ని ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్లో ఏర్పాటు చేయటానికి ఆ సంస్థ ముందుకు వచ్చిందని వర్సిటీ వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ రవీందర్ తెలిపారు. విద్యార్థుల పరిశోధనలకు ఉపయోగపడేలా అడోబి కార్యకలాపాలను ప్రారంభిస్తుందని వెల్లడించారు. ఓయూ అభివృద్ధిలో పూర్వ విద్యార్థుల భాగస్వామ్యాన్ని కీలకం చేయడంలో భాగంగా అమెరికా పర్యటనలో ఉన్న వీసీ.. అడోబి సంస్థతో పరస్పర అవగాహన ఒప్పందం కుదుర్చుకొన్నామని పేర్కొన్నారు. శుక్రవారం శాన్ఫ్రాన్సిస్కోలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో అడోబి సీఈవో శంతను నారాయణ్, తాను ఒప్పంద పత్రాలపై సంతకాలు చేసినట్టు వివరించారు. ఈ సందర్భంగా ఓయూలో విద్యాప్రమాణాలు, పరిశోధనలు పెంచేందుకు ప్రొఫెసర్లు, విద్యార్థులకు పూర్వ విద్యార్థులు సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఓయూ పూర్వ విద్యార్థి, ఐప్లెడ్ వెంచర్స్ ప్రెసిడెంట్ ఓంకారం నలమాసుతోనూ సమావేశమై వర్సిటీ అభివృద్ధి కార్యక్రమాలను వివరించానని తెలిపారు.
శంతను నారాయణ్ మాట్లాడుతూ వర్సిటీ అభివృద్ధికి అవసరమైన వివరాలతో రిపోర్ట్ సమర్పించాలని వీసీకి సూచించారు. ఓయూ అభివృద్ధి కోసం ఎలాంటి సహకారాన్ని అందించటానికైనా సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. వచ్చే ఆగస్టులో హైదరాబాద్కు వస్తున్నట్టు చెప్పిన ఆయన ఓయూ అధ్యాపకులు, విద్యార్థులతో సమావేశమవుతానని పేర్కొన్నారు. అటు.. మార్కెట్ అవసరాలను అనుగుణంగా సిలబస్లో మార్పులు చేయాల్సిన అవసరం ఉన్నదని ఓంకారం అభిప్రాయపడ్డారు. త్వరలోనే ఓయూను సందర్శించి పరిశోధకులు, విద్యార్థులతో సమావేశం అవుతానని వెల్లడించారు.