హైదరాబాద్, జూన్ 14 (నమస్తే తెలంగాణ): జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశయంలో మరో ముందడుగు పడింది. జగిత్యాలలో స్థాపించే ప్రభుత్వ మెడికల్ కాలేజీకి నేషనల్ మెడికల్ కమిషన్కు (ఎన్ఎంసీ) చెందిన ‘మెడికల్ అసెస్మెంట్ అండ్ రేటింగ్ బోర్డు’ (ఎంఏఆర్బీ) ప్రాథమిక అనుమతులు జారీ చేసింది. ప్రతిపాదించిన మేరకు 150 ఎంబీబీఎస్ సీట్లకు అనుమతులు ఇచ్చింది. 2022-23 విద్యాసంవత్సరంలో అడ్మిషన్లు ప్రారంభించేందుకు గడువులోగా కొన్ని పత్రాలను సమర్పించాలని, మరికొన్ని వసతులు కల్పించాల్సి ఉన్నదని సూచించింది.
ఇవి పూర్తి చేస్తే పూర్తిస్థాయి అనుమతులు మంజూరు చేస్తామని చెప్పింది. ఈ ప్రక్రియ లాంఛనమే అని.. ప్రభుత్వ వైద్యరంగంలో మరో 150 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి వచ్చినట్టేనని వైద్య నిపుణులు తెలిపారు. జిల్లాకు ఒక మెడికల్ కాలేజీలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం మొదటి దశలో మహబూబ్నగర్, సిద్దిపేట, నల్లగొండ, సూర్యాపేటల్లో కాలేజీలను ఏర్పాటుచేసింది. రెండో దశలో ఎనిమిది కాలేజీలను నెలకొల్పింది. 2022-23 విద్యాసంవత్సరంలో అడ్మిషన్లు జరిగేలా మంచిర్యాల, రామగుండం, జగిత్యాల, వనపర్తి, నాగర్ కర్నూల్, మహబూబాబాద్, కొత్తగూడెం, సంగారెడ్డి మెడికల్ కాలేజీలను సిద్ధం చేస్తున్నది. ఇటీవలే ఎంఏఆర్బీ తనిఖీలు పూర్తయ్యాయి.