హైదరాబాద్, సెప్టెంబర్ 19 (నమస్తే తెలంగాణ): విదేశాల్లో చదువు అంటేనే విద్యార్థుల్లో కొంత భయం ఉంటుంది. అక్కడి వాతావరణం, విదేశీ అధ్యాపకులు, విద్యార్థుల మధ్య ఇమడలేమేమోనన్న అనుమానాలు వేధిస్తుంటాయి. 50 శాతానికి పైగా విద్యార్థులు మనవాళ్లే ఉండీ.. పాఠాలు చెప్పేదీ మనవాళ్లే అయితే అదో రకమైన భరోసా లభిస్తుంది. ఇదే తరహాలో కిర్గిజ్స్తాన్ స్టేట్ మెడికల్ అకాడమీ భారతీయ అధ్యాపకులను నియమించుకొన్నది. ఈ మేరకు వర్సిటీలోని 19 విభాగాల్లో భారతీయ అధ్యాపకులను తమ కాలేజీలో నియమించిన్నట్టు కిర్గిస్తాన్ స్టేట్ మెడికల్ అకాడమీ డీన్ వెల్లడించారు. సోమవారం హైదరాబాద్లో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడుతూ.. తమ యూనివర్సిటీలో ఏటా 600కు పైగా సీట్లుంటే 300 మంది భారతీయ విద్యార్థులే ప్రవేశాలు పొందుతున్నారని తెలిపారు.
ప్రభుత్వ మెడికల్ కాలేజీ అయిన తమ విద్యాసంస్థలో ప్రపంచంలోనే అతిపెద్ద అనాటమీ ల్యాబరేటరీ ఉన్నదని వివరించారు. నీట్ క్వాలిఫై అయిన విద్యార్థులకు తమ వర్సిటీలో ప్రవేశాలతోపాటు హాస్టల్ వసతిని కల్పిస్తున్నామని వెల్లడించారు. ఏడాదికి 4,500 నుంచి 4,800 డాలర్ల ఖర్చుతో ఎంబీబీఎస్ పూర్తిచేయొచ్చని తెలిపారు. కోర్సులు, కరిక్యులం అంతా ఇండియన్ నేషనల్ మెడికల్ అకాడమీ ప్రకారమే కొనసాగుతుందని చెప్పారు. కార్యక్రమంలో ఎడుటెక్ సీఈవో శ్రీనేశ్, ప్రోసియం సీఈవో డాక్టర్ భానుప్రకాశ్, ఈవింగ్స్ సీఈవో ఏ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.