హైదరాబాద్, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ): ఇతర శాఖల్లోకి వీఆర్వోల సర్దుబాటు విజయవంతంగా ముగిసింది. 98 శాతం వీఆర్వోలు ఇప్పటి వరకు తమకు కేటాయించిన శాఖల్లో చేరారు. రాష్ట్రంలో 5,137 మంది వీఆర్వోలు ఉండగా, ఇప్పటివరకు 5,014 మంది వారికి కేటాయించిన శాఖల్లో జాయిన్ అయ్యారు. కేవలం 123 మంది వీఆర్వోలు మాత్రమే వారికి కేటాయించిన శాఖల్లో చేరలేదు. వీఆర్వోలను ఇతర శాఖల్లో కేటాయిస్తూ ఇచ్చిన ఉత్తర్వులపై హైకోర్టులో కొంత మంది రిట్పిటిషన్లు దాఖలు చేశారు.
దీనిపై విచారించిన న్యాయస్థానం పిటిషనర్లకు మాత్రమే స్టేటస్కో ఇచ్చింది, కానీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదు. దీంతో చట్టంలోని నిబంధనల ప్రకారం వీఆర్ఎస్ సహా డ్యూటీకి రిపోర్ట్ చేయని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం తీవ్రంగా ఆలోచిస్తున్నట్టు తెలిసింది.
రాష్ట్ర ప్రభుత్వం భూరికార్డుల ప్రక్షాళన చేసి, భూరికార్డులన్నింటినీ పటిష్ఠంచేసింది. పక్కాగా రూపొందించిన నూతన పట్టాదార్ పాస్పుస్తకాలు అందజేసింది. పైగా రెవెన్యూ డాటాను వ్యవసాయశాఖకు లింక్ చేసింది. వ్యవసాయశాఖ అధికారులే గ్రామాల్లో పర్యటించి పంటల వివరాలు సేకరిస్తున్నారు. రైతులు ఏ పంటలు వేయాలో సలహాలు, సూచనలు ఇస్తున్నారు. పక్కా రికార్డుతో అర్హులైన రైతులందరికీ రైతుబంధు, రైతుబీమా పథకాలు దిగ్విజయంగా అమలు అవుతున్నాయి.
మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూశాఖలో అవినీతిని నిర్మూలించడంతోపాటు రైతులకు సత్వర సేవలు అందేలా కోర్ బ్యాంకింగ్ విధానంలో క్రయవిక్రయాల నమోదు జరిగేలా చేసింది. ఏ ఒక్క రైతు నయాపైసా లంచం ఇవ్వాల్సిన అవసరం లేకుండా రిజిస్ట్రేషన్, ఆ వెంటనే మ్యుటేషన్ ఒకేసారి జరిగే విధానం చర్యలు తీసుకొన్నది. ఈ మేరకు రికార్డ్స్ ఆఫ్ రైట్ చట్టానికి సవరణ చేసింది. రెవెన్యూ రికార్డులను ఫ్రీజ్ చేసింది. వీటన్నింటి ఫలితంగా రెవెన్యూశాఖలో వీఆర్వోల అవసరం లేకుండా పోయింది. దీంతో సర్కారు ఆ వ్యవస్థను రద్దు చేస్తూ చట్టం చేసింది.
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులైన వీఆర్వోలకు అన్యాయం జరగకుండా ఉద్యోగ భద్రత కల్పిస్తూ ఇతర శాఖల్లో కేటాయించాలని నిర్ణయించింది. సుదీర్ఘ కసరత్తు అనంతరం వివిధ శాఖల్లో సర్దుబాటు చేసింది. ఈ మేరకు 121 జీవో విడుదల చేసి, జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చింది. ప్రభుత్వ ఆదేశాలతో వీఆర్వోలు (98శాతం) స్వచ్ఛందంగా ఇతర శాఖల్లో చేరారు.
ప్రభుత్వంపై నిందారోపణలు చేయడానికి ఎవరో చేసిన మిస్గైడ్తో 18 మంది వీఆర్వోలు ఇతర శాఖల్లో సర్దుబాటు చేయడాన్ని సవాల్ చేస్తూ 121 జీవోకు వ్యతిరేకంగా హైకోర్టును ఆశ్రయించారు. కేసును పరిశీలించిన న్యాయస్థానం పిటిసనర్లకు మాత్రమే వర్తింపజేస్తూ స్టేటస్కో ఇచ్చింది. విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది. స్టేటస్కో ఇచ్చినప్పటికీ పిటిషన్ వేసిన ఉద్యోగులు కూడా విధుల్లో చేరడానికి న్యాయస్థానం అవకాశం ఇచ్చింది.
హైకోర్టు ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని విధుల్లో చేరాలని మరికొంత మంది వీఆర్వోలు ఆలోచిస్తున్నట్టు తెలిసింది. ఇతర శాఖల్లో వీఆర్వోల కేటాయింపు, చేరికలపై సీఎం కేసీఆర్ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించినట్టు సమాచారం. ఇప్పటికే 98 శాతం మంది వీఆర్వోలు ఇతరశాఖల్లో చేరినందున ఎలాంటి ఇబ్బంది లేదని భావించినట్టు తెలిసింది.
ఇతర శాఖల్లో చేరడానికి విముఖత చూపుతున్నవారు ఒకరిద్దరు ఎవరైనా ఉంటే వాళ్లు వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోవడానికి దరఖాస్తు చేసుకొంటే అప్పుడు పరిశీలిద్దామనే ఆలోచనకు వచ్చినట్టు సమాచారం. కాగా, వీఆర్ఎస్ దరఖాస్తు చేసుకోకుండా డ్యూటీకి రిపోర్ట్ చేయని వీఆర్వోలపై కఠిన చర్యలు తీసుకోవాలనే దిశగా ఆలోచిస్తున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది.