నిర్మల్, జూలై 6: జల్, జంగల్, జమీన్ అనే కుమ్రం భీం కలలను కూడా సాకారం చేసిన ఘనత ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావుకే దక్కుతుందని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. గురువారం జిల్లాలోని మామాడ, సారంగాపూర్ మండల కేంద్రాల్లో లబ్ధిదారులకు పోడు పట్టాలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..ఎన్నో ఏండ్లుగా పరిష్కారానికి నోచని పోడు భూముల సమస్యను సీఎం కేసీఆర్ పరిష్కరించి, భూమి లేని నిరుపేద గిరిజనులకు పట్టాలు అందించి భూహక్కు కల్పించారని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1.52 లక్షల మందికి ఏకంగా 4.50 లక్షల ఎకరాలకు పైగా పోడు పట్టాలను అందిస్తున్నామని వెల్లడించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 37,000 మందికి లక్ష రెండు వేల ఎకరాలకు పోడు పట్టాలను పంపిణీ చేస్తున్నామని పేర్కొన్నారు.
పోడు పట్టాలు అందుకున్న రైతులకు రైతు బంధు, రైతుబీమా కూడా వర్తిస్తుందని తెలిపారు. ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఎకరానికి ఐదు వేల రూపాయలు చొప్పున రైతుబంధు డబ్బులు జమ అవుతాయని చెప్పారు. ఇకపై అడవుల జోలికి ఎవ్వరూ వెళ్లవద్దని, అడవుల సంరక్షణకు అడవి బిడ్డలు తోడ్పాటునందించాలని కోరారు.
మరోవైపు తండాలను పంచాయతీలుగా గుర్తించడంతోపాటు అభివృద్ధికి నిధుల కేటాయింపు, గిరిజనులకు రిజర్వేషన్ల పెంపు వంటివి సీఎం కేసీఆర్తోనే సాధ్యమయ్యాయని గుర్తుచేశారు. అనంతరం గిరిజనుల కోరిక మేరకు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ..రవీంద్రనాయక్ తండాలో పోడు భూమిలో అరక పట్టి పొలం దున్నారు.