SSC Paper Leak | హైదరాబాద్, మార్చి 20 (నమస్తే తెలంగాణ)/ఉట్నూరు: పదో తరగతి పరీక్షల్లో మాస్కాపీయింగ్ జరుగుతున్నదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పరీక్ష ప్రారంభం కాగానే ప్రశ్నాపత్రంలోని ప్రశ్నలను తెల్లకాగితం మీద రాసి బయటకు తీసుకొని రావడం, వాటికి ఉపాధ్యాయులతో జవాబులు రాయించి తిరిగి విద్యార్థులకు చేరవేయడం, పార్ట్-బీలోని ప్రశ్నలకు ఉపాధ్యాయులే జవాబులు డిక్టేట్ చేయడం లాంటి సంఘటనలు జరుగుతున్నాయని ఆరోపణలున్నాయి. ప్రైవేట్ పాఠశాలల నిర్వాహకులు ఇన్విజిలేటర్లను మచ్చిక చేసుకొని మాస్ కాపీయింగ్ వ్యవహారం నడిపిస్తున్నారనే విమర్శలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఒక పరీక్షా కేంద్రం వద్ద జరిగిన తతంగాన్ని ఆడియో, వీడియో రూపంలో రికార్డు చేసి, సోషల్మీడియాలో వైరల్ చేయడం కలకలం సృష్టించింది.
విశ్వసనీయ వర్గాల కథకం ప్రకారం.. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్లోని జడ్పీహెచ్ఎస్లోని సెంటర్ కేంద్రంగా మాస్ కాపీయింగ్ జరిగినట్టు సమాచారం. పదో తరగతి విద్యార్థులకు మంగళవారం హిందీ పేపర్ పరీక్ష నిర్వహించారు. ఉట్నూర్ జడ్పీహెచ్ఎస్ పరీక్షాకేంద్రం నుంచి కొంతమంది సిబ్బంది ప్రశ్నపత్రంలోని ప్రశ్నలను తెల్లకాగితంపై రాసుకొని బయటికి తీసుకొచ్చారు. సంబంధిత సబ్జెక్టు టీచర్ ఒకరు తన ఇంటి వద్ద వాటికి ఆన్సర్లు రాసిచ్చి, విద్యార్థులకు చేరవేశారని తెలుస్తున్నది. వీడియోలో కనిపిస్తున్న ఆ టీచర్ మైనార్టీ గురుకుల ఉపాధ్యాయుడని విశ్వసనీయవర్గాలు తెలిపాయి. ఈ ఆడియోకు సంబంధించిన పూర్తి వివరాలను కలెక్టర్ తెప్పించుకున్నారని, తదుపరి చర్యలు తీసుకుంటారని స్థానిక విద్యాశాఖ అధికారులు పేర్కొన్నారు. అయితే, ఈ సంఘటనపై ఆరా తీసేందుకు, వివరణ కోరేందుకు ‘నమస్తే తెలంగాణ’ ప్రతినిధి ప్రయత్నించగా.. ఆదిలాబాద్ డీఈవోతోపాటు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కృష్ణారావు ఫోన్ ఎత్తలేదు. ఈ ఘటన మంగళవారం జరగగా బుధవారం వరకు ఎస్సెస్సీ బోర్డు నుంచి కూడా వివరణ వెలువడలేదు. బోర్డుకు చెందిన ఒక అధికారి ఫోన్లో మాట్లాడుతూ.. ఉట్నూర్లో పరీక్షాకేంద్రం పైకప్పు కూలి విద్యార్థి గాయపడ్డ ఘటన తప్ప ఆడియో, వీడియోలు బయటకొచ్చిన విషయం తనకు తెలియదని.. కనీస సమాచారంలేదని చెప్పారు. సోషల్ మీడియాలో వైరల్కావడంపై స్థానిక పోలీసులను ఆరా తీయగా, తమకు ఈ విషయంలో ఫిర్యాదు అందలేదని, విద్యాశాఖ అంతా చూసుకుంటుందని పేర్కొన్నారు.
విద్యాశాఖ తన వద్దనే ఉన్నదని, పేపర్ లీకేజీలతో ప్రభుత్వాలు పడిపోయిన సందర్భాలు ఉన్నాయని, కాబట్టి పరీక్షలను పకడ్భందీగా నిర్వహించాలంటూ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేసిన హెచ్చరికలను క్షేత్రస్థాయి సిబ్బంది అంత సీరియస్గా తీసుకోవడం లేదనడానికి తాజా ఆడియో, వీడియోలే నిదర్శనమని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ ఘటన పూర్వాపరాలు బయటికొస్తే ఎవరి మీద వేటు పడుతుందో? ఎవరిపై చర్యలు తీసుకుంటారో? అన్న టెన్షన్ ఉన్నతాధికారులను పీడిస్తున్నది.
నిరుడు కూడా పదో తరగతి ప్రశ్నపత్రాలు సెల్ఫోన్లల్లో ప్రత్యక్షమవ్వడంతో ఈ సారి అధికారులు కఠిన ఆంక్షలు విధించారు. పరీక్ష కేంద్రాల వద్ద సెల్ఫోన్లను అనుమతించడం లేదు. దీంతో పలుచోట్ల ప్రశ్నలను తెల్లకాగితాల మీదనే రాసి బయటకు తీసుకొస్తున్నారని, ఆయా జవాబులను సంబంధిత ఉపాధ్యాయుల చేత రాయించుకొని విద్యార్థులకు పంపిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఇంత జరుగుతున్నా సెంటర్ చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంటల్ అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. పరీక్ష రోజున సబ్జెక్టు టీచర్లు పరీక్షాకేంద్రాల్లో ఉండకూడదని, విధుల్లో ఉన్న వారెవరూ పరీక్షాకేంద్రం దాటి బయటకు వెళ్లరాదనే నిబంధనలను ఖాతరు చేయకపోవడం వల్లనే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.
అయిపోయింది సార్. మీరు కేర్ఫుల్గా ఉండమని చెప్పారుకదా.. కేర్ఫుల్గానే ఉన్న.
దొరికింది సార్.
పేపర్ కొంచెం లేట్గా చేతికొచ్చింది. జవాబులు లోపలికి పంపించాం.
రాసుకుని తీసుకొచ్చాం. లాంగ్ క్వశ్చన్లు, షార్ట్ క్వశ్చన్లు రాసుకుని తీసుకొచ్చాం.
జడ్పీ సెంటర్ నుంచి.
రాసి పంపించాం. అలమ్ దుల్లా. దాదాపు అంతా లోపలికి పంపించాం.
అలమ్ దుల్లా.. విద్యార్థులందరికీ అర్ధం చేయించాం.
మొత్తం రాశారు. కొన్ని పార్ట్-బీలో తెలిసిన పేరాగ్రాఫ్స్ వారే రాసుకున్నారు.
అన్ని సెంటర్లకు చేర్చాం. కానీ ఒక్కోక్కరు ఒక్కో సెంటర్లో ఉన్నారు. ఎవరికి వెళ్లిందో ఎవరికి వెళ్లలేదో అర్ధం కాలేదు.
ఇది ఇద్దరు వ్యక్తుల మధ్య ఉర్దూ భాషలో జరిగిన సంభాషణ సారాంశం. దీంతోపాటు ఒక టీచరే జవాబులను పేపర్పై రాస్తున్న మరో వీడియో కూడా బయటికొచ్చింది. బుధవారం ఉదయం నుంచి
సోషల్మీడియాలో ఈ ఆడియో, వీడియో వైరల్ అవుతున్నాయి.