ఆదిలాబాద్ : వైద్య బృందాలతో తమ ఆరోగ్య సమాచారాన్ని పంచుకోవాలని, వారు సూచించిన మందులను తీసుకోవాల్సిందిగా ఆదిలాబాద్ ఇంఛార్జీ కలెక్టర్ పీఎస్ రాహుల్ రాజ్ ప్రజలను కోరారు. గుడిహత్నూర్ మండల కేంద్రంలోని జవహర్నగర్లో వైద్యారోగ్యశాఖ బృందాలు శుక్రవారం నిర్వహించిన ఇంటింటి సర్వేను కలెక్టర్ పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జ్వరంతో బాధపడుతున్న పౌరులు మందులు తీసుకోవాలని, శారీరక దూరం పాటించాలన్నారు. ఫేస్ మాస్క్లు తప్పనిసరిగా ధరించాలని, శానిటైజ్ చేసుకోవాలన్నారు. కొవిడ్ -19 ను జాగ్రత్తలు పాటించడం ద్వారా వ్యాధి వ్యాప్తిని నివారించవచ్చని ఆయన పేర్కొన్నారు. రిమ్స్ ఆదిలాబాద్లో తగినంత ఆక్సిజన్, సరిపడినన్ని రెమ్డెసివిర్ ఇంజక్షన్లు, ఇతర మందులు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. ఆక్సిజన్ సౌకర్యంతో 295 బెడ్స్, ఐసీయూ పడకలతో 105 బెడ్స్ అందుబాటులో ఉన్నట్లు చెప్పారు. త్వరలోనే పడకల పరిమాణాన్ని 600కు పెంచే ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు ఆయన పేర్కొన్నారు.