హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 24 (నమస్తే తెలంగాణ): నిర్మాణరంగ కార్మికుల కడుపు చల్లగుండాలంటే చేతినిండా పని, పనికి తగిన వేతనం ఉండాల్సిందే. అప్పుడే వారి కుటుంబం ఆర్థికంగా ఎదగటం, పిల్లలను చదివించుకోవడం సాధ్యమవుతుంది. తెలంగాణలో.. మరీముఖ్యంగా హైదరాబాద్లో నిర్మాణ రంగ కార్మికులకు పనికి తగిన వేతనాలు చెల్లిస్తున్నట్టు తాజా సర్వేలో తేలింది. ఇటీవల ప్రాజెక్ట్ హీరో ది కన్స్ట్రక్షన్ టెక్నో యాప్ ద్వారా సర్వే నిర్వహించింది. దీని నివేదిక ప్రకారం.. కార్మికుల శ్రేయస్సులో హైదరాబాద్ టాప్లో ఉన్నది. దేశంలోని ఇతర మెట్రో నగరాల్లోకెల్లా అత్యధిక వేతనాలు ఇక్కడే అందుతున్నాయి.
ముంబై, చెన్నై, బెంగళూరు, పుణె, ఢిల్లీ కంటే మెరుగైన వేతనాలు ఉన్నాయి. దినసరి వేతనాలు, నిర్మాణరంగ కార్మికుల జీవన ప్రమాణస్థాయిల్లోనూ హైదరాబాద్ టాప్లో ఉన్నదని ప్రాజెక్టు హీరో సీఈవో అండ్ ఫౌండర్ సత్యవ్యాస్ తెలిపారు. 1.4 లక్షల జాబ్ ప్లేస్మెంట్ సంస్థల నుంచి సమాచారం సేకరించి నివేదికను తయారుచేశామని వెల్లడించారు. ఇతర నగరాల్లో కార్మికుల సగటు వేతనం 5-8 శాతం పెరగ్గా, హైదరాబాద్లో 20 శాతం పెరిగిందని వివరించారు. వేతనాల్లో తాపీ పని 16 శాతం, వడ్రంగి 16 శాతం, ఎలక్ట్రికల్ వర్క్స్ 14 శాతం, పెయింటింగ్ 10 శాతం, షట్టరింగ్ 8 శాతం పెరుగుదల ఉన్నట్టు పేర్కొన్నారు.
ఇతర రాష్ర్టాల నుంచి నగరానికి వలస
దేశవ్యాప్తంగా ఉన్న రాష్ర్టాల నుంచి తెలంగాణకు వర్కర్లను తీసుకురావాల్సిన అవసరం ఏర్పడిందని సర్వే వెల్లడించింది. ఇక్కడ పెరుగుతున్న నిర్మాణ రంగం వల్ల ఏటా కార్మికులు, నైపుణ్యం ఉన్న వర్కర్లు దిగుమతి అవుతున్నారని తెలిపింది. ఎక్కువ వేతనాలు, రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు కూడా వలస కార్మికులను ఆకర్షిస్తున్నాయి. అనుకోని సంఘటన జరిగితే ఆదుకొనేందుకు బీమా, ఇతర సదుపాయాలు ఉండటం వల్ల వారికి లాభం చేకూరుతున్నది.
ఆయా రాష్ర్టాల నుంచి వస్తున్న కార్మికుల శాతం ఇలా..
ఉత్తరప్రదేశ్ : 42 శాతం
బీహార్ : 16 శాతం
పచ్చిమ బెంగాల్ : 10 శాతం
ఒడిశా : 9 శాతం
మహారాష్ట్ర : 6 శాతం