కీసర, సెప్టెంబర్ 30 : తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి టీఆర్ఎస్లో చేరుతున్నారని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి తెలిపారు. మేడ్చల్ జిల్లా కీసర మండలం భోగారం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు, మహిళలు శుక్రవారం టీఆర్ఎస్ పార్టీలో చేరారు.
మంత్రి క్యాంపు కార్యాలయంలో వారికి గులాబీ కండువాలు గప్పి పార్టీలోకి స్వాగతించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ హయాంలో గత ఎనిమిది సంవత్సరాల నుంచి రాష్ట్రంలో కోట్లాది రూపాయలతో అనేక రకాల అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు.
రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి దేశంలో మరెక్కడా జరుగడం లేదన్నారు. యావత్ దేశ ప్రజలు కేసీఆర్ను దేశానికి నాయకత్వం వహించాలని కోరుతున్నారన్నారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధికి ఇటు కాంగ్రెస్, బీజేపీలకు నిద్ర పట్టడం లేదని మంత్రి ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో ఈ పార్టీలకు భవిష్యత్ ఉండదని మంత్రి తెలిపారు.
కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ బెస్త వెంకటేశ్, కీసర ఎంపీపీ మల్లారపు ఇందిర, మండల పార్టీ అధ్యక్షులు జలాల్పురం సుధాకర్రెడ్డి, భోగారం కో-ఆప్షన్ సభ్యుడు డబ్బి నర్సింహరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.