TSRTC | హైదరాబాద్, ఫిబ్రవరి 2 (నమస్తే తెలంగాణ): టీఎస్ఆర్టీసీకి కుచ్చుటోపీ పెట్టాడు ఓ కేటుగాడు. ఖమ్మం జిల్లాకు చెందిన వీ సునీల్ ‘గో రూరల్ ఇండియా’ పేరుతో తన భార్య మృదులతో కలిసి యాడ్ ఏజెన్సీని నిర్వహిస్తున్నాడు. రంగారెడ్డి జిల్లా కుత్బుల్లాపూర్ మండలం చింతల్లో నివాసం ఉంటున్న సునీల్ టీఎస్ఆర్టీసీలో హైదరాబాద్, సికింద్రాబాద్ రీజియన్లో 2015 నుంచి 2020 వరకు ఆర్టీసీ యాడ్స్ కాంట్రాక్ట్ను పొందాడు.
హైదరాబాద్ రీజియన్కు 10,74,89,006, సికింద్రాబాద్ రీజియన్కు 10,97,38,389 కాంట్రాక్ట్ రుసుము చెల్లించాల్సి ఉన్నది. దాదాపు రూ.21,72,27,395 లీజు చెల్లించాల్సిన సునీల్.. ఉద్దేశపూర్వకంగా చెల్లని చెక్కులు ఇచ్చాడు. అవి చెల్లకపోవడంతో ఆర్టీసీ అధికారులు మోసం చేసినట్టు సునీల్పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆర్టీసీ అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన సీసీఎస్ పోలీసులు శుక్రవారం వీ సునీల్ను అరెస్టు చేశారు.