కాశీబుగ్గ, జూన్ 23 : ఇందిరమ్మ ఇండ్ల బిల్లులు రాక.. లబ్ధిదారులు డబ్బులు ఇవ్వక ఓ ఉద్యమకారుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన వరంగల్ నగరంలోని కాశీబుగ్గలో మంగళవారం చోటుచేసుకున్నది. స్థానికుల కథనం ప్రకారం.. తెలంగాణ ఉద్యమకారుడు జెట్టి అశోక్ (54) బీఆర్ఎస్ హయాం లో మూడేండ్ల క్రితం దళిత బంధు పథకంలో లబ్ధిపొంది 14వ డివిజన్ రెడ్డిపాలెం జంక్షన్లో సిమెంట్ అండ్ ఐరన్ షాపు ఏర్పాటు చేసుకొని వ్యాపారం నిర్వహిస్తున్నాడు.
ఇటీవల ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల కోసం మేస్త్రీలు, స్థానికులకు తన స్థోమతకు మించి అరువుపై స రుకు సరఫరా చేశా డు. వారిని డబ్బులు అడిగితే ఇందిరమ్మ బిల్లులు రాలేదని దాటవేస్తున్నారు. షాపులో సరుకులేక, వస్తువులు తెచ్చినచోట డబ్బులు కట్టలేక మనస్తాపానికి గురైన అశోక్ రెడ్డిపాలెంలోని తన షాపులోనే మంగళవారం ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎనుమాముల సీఐ జవ్వాజి సురేశ్ ఘటనాస్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేశారు. మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, మాజీ కార్పొరేటర్లు అశోక్ మృతదేహం వద్ద నివాళులర్పించారు.