హైదరాబాద్, అక్టోబర్ 5 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో వచ్చే 2030 వరకు జీవవైవిధ్య పరిరక్షణ, అవగాహన, పరిశోధనలపై దృష్టి కేంద్రీకరించినట్టు రాష్ట్ర జీవవైవిధ్య మండలి చైర్మన్, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ రజత్కుమార్ వెల్లడించారు. గురువారం హైదరాబాద్ కోఠి మహిళా విశ్వవిద్యాలయంలో జరిగిన సమావేశంలో జీవవైవిధ్య వ్యూహం, కార్యాచరణ ప్రణాళికను ఆయన విడుదల చేశారు. దేశంలో జీవవైవిధ్య కార్యాచరణ ప్రణాళికను విడుదల చేసిన తొలి రాష్ట్రంగా తెలంగాణ గుర్తింపు పొందిందని రజత్కుమార్ తెలిపారు.
సెంటర్ ఫర్ ఇన్నోవేషన్స్ ఇన్ పబ్లిక్ సిస్టమ్స్ (సీఐపీఎస్)తోపాటు అనేక మంది వాటాదారులతో సంప్రదింపులు జరిపి ఈ కార్యాచరణను రూపొందించినట్టు చెప్పారు. అటవీ, వ్యవసాయం, నీటిపారుదల, పశుసంవర్ధక, మత్స్యశాఖ వంటి శాఖల కృషిని లెక్కించేందుకు బయోఫిన్ వంటి సాధనాలను ఉపయోగించినట్టు వివరించారు. సీఐపీఎస్ డైరెక్టర్ డాక్టర్ వల్లి మాణికం కార్యాచరణ ప్రణాళిక గురించి వివరించారు. కార్యక్రమంలో నేషనల్ బయో డైవర్సిటీ అథారిటీ చైర్పర్సన్ సీ అచలేందర్రెడ్డి, యూఎన్డీపీ ప్రొఫెసర్ సునీల్ పడాలే, తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం వీసీ ఎం విజ్జులత పాల్గొన్నారు.