నిజామాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న దళిత బంధు పథకంతో లబ్ధిదారులు స్వయం సమృద్ధిని సాధించాలని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సూచించారు. దళితబంధు పథకం కింద తొలి విడతలో ఎంపికైన బాల్కొండ నియోజకవర్గ లబ్ధిదారులకు గురువారం వేల్పూర్ మార్కెట్ యార్డు ఆవరణలో మంత్రి ఆయా యూనిట్లను పంపిణీ చేశారు.
ఇదివరకే 86 మందికి వివిధ యూనిట్లను అందజేయగా, గురువారం మరో 14 మందికి వారు ఎంచుకున్న యూనిట్లను పంపిణీ చేశారు. 64 మందికి కుట్టు మిషన్లు(రెండు చొప్పున), 15 వేల రూపాయల డీడీ మొత్తాన్ని అందజేశారు. మరో 15 మందికి 50 వేల రూపాయల చొప్పున ఆర్థిక లబ్ధిని చేకూర్చారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..గడిచిన అరవై సంవత్సరాలలో నాటి పాలకులు దళితులను ఓటు బ్యాంకుగా వినియోగించుకున్నారు.
ఏనాడు వారి సంక్షేమానికి పాటుపడలేదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత కుటుంబాల స్థితిగతుల్లో సమూల మార్పులు తేవాలనే సంకల్పంతో ఎంతోమంది మేధావులతో సుదీర్ఘంగా చర్చించి దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టారని పేర్కొన్నారు. దీనిని లబ్ధిదారులు పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకుని ఆర్థిక పరిపుష్టిని సాధించాలన్నారు.
ముఖ్యంగా మహిళలు ప్రభుత్వ తోడ్పాటుతో వ్యాపారాల్లో రాణించి తమ కుటుంబాలను అభ్యున్నతి దిశగా పయనింపజేసుకోవాలని సూచించారు. సబ్బండ వర్ణాల సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. కార్యక్రమంలో డీసీసీబీ వైస్ చైర్మన్ రమేష్, ఆర్డీఓ రాజేశ్వర్, డీసీఓ సింహాచలం, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రమేష్ తదితరులు పాల్గొన్నారు.