హైదరాబాద్, జూన్ 19 (నమస్తే తెలంగాణ): ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ విశిష్ట సాహితీ పురసారానికి ఆచార్య ఎన్ గోపి ఎంపికయ్యారు. సాహిత్యంలో అత్యున్నత శిఖరాలను అధిరోహించిన సాహితీమూర్తులకు ప్రతి ఏటా భారత జాగృతి ప్రదానం చేసే తొలి అవార్డును ఎన్ గోపి అందుకోనున్నారు. హైదరాబాద్ అబిడ్స్లోని తెలంగాణ సారస్వత పరిషత్తులో బుధవారం జరిగే కార్యక్రమంలో భారత జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈ అవార్డును ప్రదానం చేయనున్నారు. అవార్డు కింద రూ. 1,01,116 నగదుతోపాటు స్వర్ణ కంకణాన్ని బహూకరించనున్నారు.
ఆచార్య ఎన్ గోపి ఇప్పటివరకు 56 పుస్తకాలు రచించగా అందులో 26 కవితా సంకలనాలు, 7 వ్యాస సంకలనాలు, 5 అనువాద గ్రంథాలు ఉన్నాయి. అన్ని భారతీయ భాషలతోపాటు జర్మన్, పర్షియన్, రష్యన్ వంటి ప్రపంచ భాషల్లోకి ఆయన రచనలు అనువాదమయ్యాయి. తెలుగు యూనివర్సిటీ వీసీగా, కాకతీయ, ద్రవిడ యూనివర్సిటీల ఇన్చార్జి వీసీగా ఆయన వ్యవహరించారు.