ఏం అవుదాం అనుకుంటున్నావ్? సాఫ్ట్వేర్ ఇంజినీర్.. చుట్టాల ప్రశ్నకు ఓ విద్యార్థి సమాధానం.. ఏం చదువుతున్నావు? అనగానే ఎక్కువమంది నోటా ఠక్కున వచ్చిన సమాధానం ఇంజినీరింగ్.. కానీ, ఇదంతా గతం. ఐదారేండ్లుగా ఇంజినీరింగ్ విద్య, వృత్తివిద్యా కోర్సులంటేనే వామ్మో అనే పరిస్థితులు వచ్చాయి. జాతీయంగా సీట్లతోపాటు ప్రవేశాలూ తగ్గుతున్నాయి. ప్లేస్మెంట్లు కల్పించడంలో వెనుకబాటు కారణంగా ఇంజినీరింగ్ చేసిన సగం మంది ఉత్తచేతులతోనే ఉన్నారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ): అత్యున్నత సాంకేతిక కోర్సు ఇంజినీరింగ్, వృత్తి విద్యకు కష్టాలు మొదలయ్యాయి. జాతీయంగా తీసుకుంటే పట్టాలు పుచ్చుకున్నవారిలో సగం మంది ఉత్తచేతులతోనే వెనుదిరుగుతున్నారని అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) వెల్లడించింది. ఆయా కోర్సుల్లో పాస్ పర్సంటేజీ బాగానే ఉన్నా.. ప్లేస్మెంట్స్కు వచ్చేసరికి వెనుకబడుతున్నట్టు నివేదించింది. ఈ మేరకు ఆయా వివరాలను ఏఐసీటీఈ వెబ్సైట్లో పొందుపరిచింది.
కొత్త కోర్సులతో గందరగోళం
ఇంజినీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ వంటి వృత్తి విద్యాకోర్సుల్లో ఏటా సీట్ల సంఖ్య తగ్గుతున్నది. జాతీయంగా ఆరేండ్లలో 8 లక్షలకు పైగా సీట్లు తగ్గిపోయాయి. మరోవైపు, ఉత్తీర్ణులయ్యేవారి సంఖ్య కూడా తగ్గుతున్నది. బీఈ, బీటెక్ పట్టాలు పుచ్చుకుంటున్నా అత్యధిక మందిని నైపుణ్యాల లేమి పట్టిపీడిస్తున్నది. ఫలితంగానే ప్లేస్మెంట్స్ను అందిపుచ్చుకోలేకపోతున్నారు. రెండేండ్లుగా కరోనా కారణంగా క్యాంపస్ ప్లేస్మెంట్స్ డ్రైవ్ను నిర్వహించలేని పరిస్థితి తలెత్తింది. మరోవైపు.. ప్రస్తుత, పరిశ్రమ అవసరాలను తీర్చేలా కొత్త కోర్సులు వస్తుండటం సైతం గందరగోళానికి తావిస్తున్నది. కోర్సు పెట్టిన రెండుమూడేండ్లకే ఆయా రంగానికి డిమాండ్ పడిపోతున్నది. మరో కొత్త రంగం పుట్టుకొస్తున్నది. దానికి డిమాండ్ ఏర్పడుతుండటంతో విద్యార్థులు ప్లేస్మెంట్స్ పొందలేని పరిస్థితి నెలకొంటున్నది.
ఏది ఇష్టమో విద్యార్థులే గుర్తించలేకపోతున్నారు
ఆసక్తి ఉన్న రంగాలను విద్యార్థులు ఇప్పటికీ గుర్తించలేకపోతున్నారు. తల్లిదండ్రులు చెప్పారనో.. తోటి విద్యార్థులు చేరారనో కోర్సులను ఎంచుకుంటున్నారు. ఈ వైఖరి మారాలి. విద్యాసంస్థల్లో అంకితభావం కలిగిన అధ్యాపకుల కొరత వేధిస్తున్నది. నైపుణ్యతలను పెంపొందించడంతోపాటు ప్రాజెక్టులు రూపొందించడంలో సమూల మార్పులు చేయాలి. పూర్తి జాబ్ ఓరియంటెడ్గా గైడెన్స్ ఇచ్చేలా ఉపాధ్యాయులు, అధ్యాపకులు చొరవ తీసుకుంటేనే ఈ సమస్యను అధిగమించగలం.