గద్వాల/గట్టు, ఫిబ్రవరి 25: రైతుబంధు నిధులు రూ.36.6 లక్షలు స్వాహా చేసిన కేసు లో నిందితులు దిగివచ్చారు. తప్పును ఒప్పుకొని సగం నిధులు అందజేయగా, మిగతా నిధులు త్వరలో చెల్లించేందుకు హామీ ఇచ్చా రు. ‘రైతుబంధు నిధులు పక్కదారి!’ శీర్షికన ఈ నెల 24న ‘నమస్తే తెలంగాణ’ మెయిన్ సంచికలో ప్రచురితమైన కథనం వ్యవసాయశాఖలో ప్రకంపనలు సృష్టిస్తున్నది. జోగుళాంబ గద్వాల జిల్లా గట్టు మండలం బలిగేర గ్రామంలో రైతుబంధు నిధులు స్వాహా అయిన విషయం తెలిసిందే. నిధులను పక్కదారి పట్టించడంలో మాచర్ల, బలిగేరలో ఏఈవోగా పనిచేసిన దివ్యతోపాటు బలిగేర, ఇందువాసి గ్రామాల్లోని మీసేవ నిర్వాహకులు సద్దాం, వీరేశ్గౌడ్ పాత్ర ఉన్నదని స్పష్టమవుతున్నది. వీరు 2019 నుంచి నిధులను పక్కదారి పట్టించినట్టు తెలుస్తున్నది. పంటల నమోదు ప్రక్రియ సమయంలో సదరు ఏఈవో మీసేవ నిర్వాహకులకు పోర్టల్ లాగిన్ అప్పగించి ఈ పని చేయించినట్టు సమాచారం. ఇదే అదునుగా భావించిన మీ సేవ నిర్వాహకులు రైతుబంధు పోర్టల్లో కొత్త రైతుల వివరాలు నమోదు, ఎడిట్ ఆప్షన్ సమయంలో గ్రామంలో అందుబాటులో లేని, శాశ్వతంగా వలస వెళ్లిన రైతులను బినామీలుగా గుర్తించి అసలు రైతుల పీపీబీ నంబర్లకు వారి బ్యాంకు ఖాతాలను నమోదు చేశారు. ఇలా ఏకంగా గ్రామంలో 64 మంది అసలు రైతులను తప్పించి బినామీలను చేర్చారు. ఇలా రూ.36.6 లక్షల రైతుబంధు నిధులను బినామీలతోపాటు ఏఈవో, మీ సేవ నిర్వాహకులు పంచుకున్నారు. ఇదిలావుండగా సదరు మీ సేవ నిర్వాహకుడు ఏకంగా తన కుటుంబ సభ్యులతోపాటు బంధువుల అకౌంట్ నంబర్లను నమోదు చేసి నిధులు దండుకున్నాడు.
బాధిత రైతులకు నిధుల అప్పగింత..
నిధుల వ్యవహారం బయటకు పొక్కడంతో అసలు రైతులు ఏఈవోతోపాటు మీ సేవ నిర్వాహకులపై ఒత్తిడి తీసుకొచ్చారు. వీరంతా కలిసి రూ.16 లక్షల రైతుబంధు నిధులను అసలు రైతులకు ఇటీవల అందజేశారు. మిగిలిన డబ్బులను త్వరలో ఇచేచందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్టు సమాచారం. రైతుబంధు నిధులను స్వాహా చేసిన ఏఈవో దివ్యను సస్పెండ్ చేయగా.. ఉద్యోగం నుంచి పూర్తిగా తొలగించాలని రైతులు, రైతు సంఘాలు, ప్రజాసంఘాల నాయకులు కోరుతున్నారు. బాధ్యులైన మీ సేవ నిర్వాహకులపై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ వ్యవహారంపై విజిలెన్స్ విభాగానికి ఫిర్యాదు చేయనున్నట్టు రైతు సంఘాల నాయకులు వెల్లడించారు.