హైదరాబాద్ : కారు షెడ్డు(car shed)లోని ఓ కారుకు ప్రమాదవశాత్తు మంటలు అంటుకొని అందులో నిద్రిస్తున్న ఓ సెక్యూరిటీ గార్డు (security guard) సజీవ దహనమైన హృదయ విదారక సంఘటన అబిడ్స్లోని బొగ్గులకుంటలో చోటు చేసుకుంది. ఈ సంఘటనలో మొత్తం మూడు కార్లు అగ్ని ఆహుతి కాగా మరో నాలుగు కార్లు పాక్షికంగా దగ్దమయ్యాయి.
అబిడ్స్ ఇన్స్పెక్టర్ ప్రసాద రావు కథనం ప్రకారం.. అబిడ్స్బొగ్గులకుంటలోని కామినేని ఆస్పత్రికి ఉన్న ఖాళీ స్థలంలో కారు గ్యారేజ్(auto garrage) కొనసాగుతుంది. ఈ గ్యారేజ్లో సుమారు 30కి పైగా కార్లు పార్కింగ్ చేసి ఉన్నాయి. కార్వాన్ ప్రాంతానికి చెందిన సంతోష్ (42)అనే వ్యక్తి ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీ తరుఫున ఇక్కడ సెక్యూరిటీ గార్డుగా మరో వ్యక్తితో కలిసి రాత్రివేళలో ఇక్కడ సెక్యూరిటీ విధులు నిర్వహిస్తున్నారు. శుక్రవారం రాత్రి సంతోష్ గ్యారేజ్కు రాగా మరో సెక్యూరిటీ గార్డ్ విధులకు హాజరుకాలేదు.
షెడ్డులో పార్క్ చేసి ఉన్న కారు లో దోమలు రాకుండా జెట్కాయల్ను పెట్టుకుని సంతోష్ నిద్రపోయాడు. జెట్ కాయల్ వల్ల ప్రమాదవశాత్తు మంటలు అంటుకోగా పక్కనే ఉన్న కామినేని దవాఖాన సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తమై అబిడ్స్ పోలీసులకు సమాచారం అందించారు. సీఐ ప్రసాదరావుతో పాటు సిబ్బంది హుటాహుటినా సంఘటన స్థలానికి చేరుకొని అగ్నిమాపక సిబ్బంది, డీఆర్ఎఫ్ సిబ్బందితో కలిసి మంటలు ఆర్పివేసి పరిశీలించగా కారులో సంతోష్ మృతదేహం కాలిపోయి కనిపించింది.
వెంటనే మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురికి తరలించారు. కారు షెడ్లో జరిగిన ఈ ప్రమాదంపై పోలీసులు విచారణ ప్రారంభించారు. ప్రమాదం ఎలా జరిగి ఉండవచ్చని ఆరాతీస్తున్నారు.