కలిసి మద్యం తాగి.. కారులో ప్రయాణం
యాక్సిడెంట్ కాగానే స్నేహితుడు మృతి..పారిపోయిన మరో స్నేహితుడు
సాంకేతిక పరిజ్ఞానంతో అరెస్ట్
ఇద్దరు కలిసి మద్యం సేవించారు… ఇంటికి వెళ్లడానికి కారులో బయలుదేరారు.. వేగంగా వెళ్తుండగా మాదాపూర్ వద్ద డివైడర్ను ఢీకొని కారు బోల్తా పడింది… ఈ ఘటనలో కారు నడుపుతున్న వ్యక్తి మృతి చెందాడు.. ఈ విషయాన్ని పోలీసులకు, అంబులెన్స్ చెప్పాల్సిన స్నేహితుడు అక్కడి నుంచి పారిపోయాడు. ఈ ఘటనలో దర్యాప్తు చేసిన పోలీసులు ఈ విషయాన్ని గుర్తించారు. ఆధారాలను సేకరించి పారిపోయిన స్నేహితుడిపై 304 పార్టు-2 కింద కేసును నమోదు చేసి రిమాండ్కు తరలించారు. గత నెల 26న స్నేహితులైన బొండపల్లి విశ్వతేజ, ఇంద్రజిత్ వర్మలు మ ద్యం సేవించారు. తెల్లవారుజాము 3 గంటల సమయంలో మాదాపూర్ మెటల్ చార్మినార్ వద్ద వేగంగా వచ్చి డివైడర్ను ఢీకొట్టారు.
ఈ ఘటనలో కారు నడుపుతున్న విశ్వతేజ మృతి చెందాడు. ఈ విషయాన్ని పోలీసు లేదా అంబులెన్స్ చెప్పాల్సిన బాధ్యత ఉన్న స్నేహితుడు ఇంద్రజిత్ వర్మ ఎవరీకి చెప్పకుండా.. అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ ఘటనపై దర్యాప్తు చేసిన అధికారులు పూర్తి ఆధారాలు, కాల్డాటా లొకేషన్, సీసీ కెమెరాల దృశ్యాలను సేకరించి ఇంద్రజిత్పై 304 పార్ట్-2 కింద కేసును నమోదు చేశారు. అతడిని అరెస్ట్ చేసి 14 రోజుల రిమాండ్కు పంపా రు. ఇంద్రజిత్ వర్మకు కారు నడుపుతున్న విశ్వతేజ మద్యం తాగాడని తెలిసి కూడా అతడిని వారించకుండా డ్రైవింగ్కు ప్రేరేపించినట్లు పోలీసులు గుర్తించారు.
అలాగే అంత పెద్ద ప్రమాదం జరిగినప్పుడు అంబులెన్స్, పోలీసులకు చెప్పాల్సి ఉండి కూడా.. అక్కడి నుంచి పారిపోయిన వైనాన్ని పోలీసులు చట్టపరంగా నేరంగా గుర్తించారు. ఇక ఎవరైనా ప్రమాదం జరిగినప్పుడు ఆ వాహనంలో ఉండేవారు పారిపోకుండా ముందుగా పోలీసులు, అంబులెన్స్లకు సమాచారం అందించాలని పోలీసులు కోరుతున్నారు. అంతేగానీ తనకేమి తెలియనట్టుగా వెళ్లిపోవడానికి ప్రయత్నిస్తే అది నేరమే…దీనికి తోడు డ్రంక్ అండ్ డ్రైవ్ను ప్రోత్సహించి వారితో కలిసి ప్రయాణం చేసినా.. ఆ సమయంలో రోడ్డు ప్రమాదం జరిగి మరణం సంభవిస్తే.. వారిపై కూడా 304 పార్ట్-2 కేసు తప్పదని సైబరాబాద్ పోలీసు హెచ్చరిస్తున్నారు.