ఖైరతాబాద్, ఏప్రిల్ 19 : ఖైరతాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో మరోసారి వర్గపోరు భగ్గుమన్నది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, ప్రతిపక్షాల మధ్య పోటీలా కాకుండా విజయా రెడ్డి వర్సెస్ ఎమ్మెల్యే దానం అన్న విధంగా సీన్ మారింది. సోమాజిగూడలోని జయ గార్డెన్స్లో శుక్రవారం జరిగిన ఖైరతాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ బూత్ స్థాయి కార్యకర్తల సమావేశంలో ఇద్దరి మధ్య ఉన్న విభేదాలు స్పష్టంగా వెలుగుచూశాయి. ఎన్నికలకు ముందే కాంగ్రెస్లో చేరిన ఖైరతాబాద్ కార్పొరేటర్ పి. విజయారెడ్డికి పార్టీ ప్రత్యేక స్థానం ఇచ్చింది. ఏకంగా టీపీసీసీ ప్రధాన కార్యదర్శిగా నియమించింది. తాజాగా ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్లో చేరిన నాటి నుంచి పార్టీ కార్యక్రమాల్లో విజయారెడ్డిని దూరం పెడుతూ వస్తున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే భూ కబ్జాల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యే, సికింద్రాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి దానం నాగేందర్ అందరినీ కలుపుకొని పనిచేయాల్సి ఉండగా, విజయారెడ్డిని దూరం పెట్టడంపై ఆమె వర్గీయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జయ గార్డెన్స్లో జరిగిన బూత్ స్థాయి కార్యకర్తల సమావేశానికి ఆమెకు ఎలాంటి ఆహ్వానం పంపలేదని చెబుతున్నారు. ఇప్పటికే గత ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభాలకు గురిచేశారంటూ విజయారెడ్డి ఎమ్మెల్యే దానంపై హైకోర్టును సైతం ఆశ్రయించగా, న్యాయస్థానం నోటీసులు సైతం జారీ చేసింది. నాటి నుంచి ఇద్దరి మధ్య విభేదాలు మరింత ఎక్కువైనట్లు తెలుస్తోంది.
జయగార్డెన్స్లో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలల్లో పార్టీలో చేరని నియోజకవర్గంలోని వివిధ పార్టీల నాయకులు, మాజీ కార్పొరేటర్ల ఫొటోలు సైతం కనిపించడం విశేషం. దానం నాగేందర్ చెప్పాపెట్టకుండానే పార్టీ మారినప్పటి నుంచి బీఆర్ఎస్లో ఆయన వెన్నంటి నడిచిన అనేక మంది నేతలు ఒక్కొక్కరుగా దూరమవుతూ వచ్చారు. ఐదేండ్ల పాటు నియోజకవర్గం, కార్యకర్తలు, ప్రజలను పట్టించుకోని ఎమ్మెల్యే.. ఇప్పుడు ఎంపీగా తమకు ఏం ఒరగబెడుతారని బాహాటంగానే ఆరోపిస్తున్నట్లు తెలిసింది. దీంతో సంఖ్య బలం ప్రదర్శించేందుకు కాంగ్రెస్లో చేరని వారి ఫొటోలను సైతం ఫ్లెక్సీల్లో ప్రదర్శించుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.