ఇందల్వాయి, జూలై 19 : తెలంగాణ యూనివర్సిటీలో ఏసీబీ అధికారులు బుధవారం మరోసారి సోదాలు నిర్వహించారు. అప్పటి వీసీ ప్రొఫెసర్ రవీందర్ గతనెల 17న హైదరాబాద్లోని తన నివాసంలో ప్రైవేట్ డిగ్రీ కళాశాలకు పరీక్షా కేంద్రం కేటాయింపు కోసం రూ.50 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడిన విషయం తెలిసిందే. అదేరోజు ఏసీబీ అధికారులు వర్సిటీలో సోదాలు నిర్వహించారు. కంట్రోలర్ అరుణను వర్సిటీకి పిలిపించి విచారణ జరిపారు. పరీక్షల విభాగంలోని పలు రికార్డులను పరిశీలించి వివరాలు నమోదు చేశారు. కాగా బుధవారం ఉదయం ఏసీబీ అధికారులు రిజిస్ట్రార్ ప్రొఫెసర్ యాదగిరిని కలిశారు. అనంతరం కంట్రోలర్ అరుణను విచారించారు. గతంలో ఏయే కళాశాలలకు పరీక్షా కేంద్రాలు కేటాయించారు. పరీక్షా కేంద్రాల కేటాయింపు, రద్దు విషయాల్లో వీసీ రవీందర్ ఏమైనా ఒత్తిడి చేశారా? అంటూ ప్రశ్నలు అడిగి వివరాలు నమోదు చేసుకున్నారు.