సూర్యాపేట : ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయనే ఆరోపణల నేపథ్యంలో సూర్యాపేట మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ వి. సోమయ్య నివాసంలో ఏసీబీ (ACB) అధికారులు గురువారంఉదయం మెరుపు దాడులు నిర్వహించారు. ఆయన ఇంట్లోని పలు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకు ఖాతాలు, ఆస్తుల వివరాలను నిశితంగా పరిశీలిస్తున్నారు. కాగా, సోమయ్య మిర్యాలగూడలో టౌన్ ప్లానింగ్ అధికారిగా పనిచేస్తుండగా అక్కడి ఎమ్మెల్యే వద్దంటూ సరెండర్ చేశాడు. దీంతో సోమయ్య పైరవీ చేసి సూర్యాపేట టిపిఓగా ఎఫ్ఎసి బాధ్యతలు తీసుకొని తదనంతరం ఫుల్ చార్జి తీసుకున్నట్లు తెలిసింది.
ప్రస్తుతం సూర్యాపేట టీపిఓ తో పాటు కోదాడ టిపిఓగా అదనపు బాధ్యతలను నిర్వహిస్తున్నాడు. ఆయన ఎక్కడ పని చేసినా ఫైళ్లను తన వద్ద ఉంచుకొని సుదీర్ఘకాలం పెండింగ్లో ఉంచేవాడని విమర్శలు ఉన్నాయి. కొన్నిసార్లు ఆన్లైన్ ఫైల్స్ను కూడా నెలల తరబడి పెండింగ్లో పెట్టి మామూళ్లు ఇస్తేనే క్లియర్ చేసేవాడని తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. సోమయ్యకు హైదరాబాద్, సూర్యాపేటలో ఇళ్లు, ప్లాట్లు ఉన్నాయి. ఎండ్లపల్లి ఒక ఆశ్రమం నిర్మించి పెద్ద ఎత్తున చందాలు వసూలు చేశారనే ఆరోపణలను సైతం మూటకట్టుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.