హైదరాబాద్ సిటీబ్యూరో/బంజారాహిల్స్, అక్టోబర్ 6 (నమస్తే తెలంగాణ): మామూళ్ల కోసం పబ్ నిర్వాహకుడిని వేధించిన బంజారాహిల్స్ పోలీస్స్టేషన్ ఇన్స్పెక్టర్ ఎం నరేందర్, ఎస్సై నవీన్రెడ్డి, హోంగార్డు శ్రీహరిపై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకెళ్తే.. హైదరాబాద్ బంజారాహ్సిలోని రాక్ క్లబ్ స్కైలాంజ్ పబ్లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో పబ్ నిర్వాహకుడు నీల రాజేశ్వర్ లక్ష్మణ్రావును జూన్ 18న ఇన్స్పెక్టర్ కలిశాడు. పబ్ నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నందున మొదటి మూడు నెలలకు రూ.4.5 లక్షలు మామూలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. హోంగార్డు తరచూ పబ్ నిర్వాహకుడిని సంప్రదిస్తూ వచ్చాడు. డబ్బులు ఇవ్వకపోవడంతో గత నెల 30న ఇన్స్పెక్టర్, ఎస్సై పబ్ వద్దకు వెళ్లి, నిర్వాహకుడిని స్టేషన్కు తరలించారు. రాత్రంతా అతనిని ఠాణాలో ఉంచి, ఉదయం విడిచిపెట్టారు. వేధింపులు తాళలేక నిర్వాహకుడు ఏసీబీని ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఉదయం 11 గంటల ప్రాంతంలో ఏసీబీ అధికారులు ఇన్స్పెక్టర్, ఎస్సై, హోంగార్డును అదుపులోకి తీసుకొని ముగ్గురిని వేర్వేరుగా ఆరు గంటల పాటు విచారించారు. ముగ్గురిపై కేసు నమోదు చేసినట్టు ఏసీబీ అధికారులు తెలిపారు.