బర్త్ సర్టిఫికెట్ కావాలన్నా.. డెత్ సర్టిఫికెట్ కావాలన్నా.. పాస్ బుక్లు రావాలన్నా.. బిల్లులు చెల్లించాలన్నా.. లంచం లేనిదే పని జరగని రోజులు. తమ పనికావాలంటే పస్తులుండైనా సరే.. అధికారి అడిగినంత ఇవ్వాల్సిన దుస్థితి. దీంతో లంచావతారుల ఆగడాలను అరికట్టేందుకు.. అవినీతి నిరోధకశాఖ దూకుడు పెంచింది. సామాన్యులను పీడించేది ఎంతటి తోపు అధికారైనా సరే.. పక్కా ఆధారాలతో రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటున్నది.
హైదరాబాద్, ఏప్రిల్ 15 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ శాఖల్లో అవినీతికి అలవాటు పడి.. సామాన్యుల నుంచి బడా కాంట్రాక్టర్ల వరకూ ఎవ్వరినీ వదలకుండా లంచాల రూపంలో డబ్బులు దండుకుంటున్న జలగల భరతం పడుతున్నది రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ. ‘ఫలానా అధికారి తమను లంచం కోసం వేధిస్తున్నాడు’ అనే ఫిర్యాదు అందడమే అలస్యం.. పక్కా ప్రణాళికతో వారిని బంధిస్తున్నది. ఇటీవల ఏసీబీకి డీజీగా నియమితులైన సీవీ ఆనంద్ తనదైన మార్క్ చూపిస్తూ.. అవినీతి అధికారుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్నారు. లంచం తీసుకువాలంటేనే భయం పుట్టేలా తమ సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వాలు ఎంతటి పటిష్ట చర్యలు తీసుకుంటున్నా.. అధికారుల్లో మార్పు రాకపోవడంతో తనదైన శైలితో, వినూత్న పంథాతో ఒక్కొక్కరికి ఒక్కో ఎర వేస్తున్నారు. గత డిసెంబర్ 27న ఏసీబీ డీజీగా బాధ్యతలు స్వీకరించిన సీవీ ఆనంద్.. 112 రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా 50 సార్లు ఎర వేసి పలువురు ప్రభుత్వ అధికారులను అరెస్టు చేయించారు. వీటిల్లో మూడు ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు ఉన్నాయి. మొత్తం 4 కేసుల్లో శిక్షలు సైతం పడ్డాయి.
అరెస్టులతో సరిపెట్టకుండా..
ఆయా ప్రభుత్వ విభాగాల్లోని ఏ అధికారైనా లంచం డిమాండ్ చేస్తే.. అందుకు తగ్గట్టుగా ఏసీబీ ట్రాప్ను సిద్ధం చేస్తున్నది. బాధితులు ఏసీబీకి సమాచారం ఇచ్చిన వెంటనే.. లంచం అడిగిన అధికారికి అనుమానం రాకుండా ఎరను సిద్ధం చేస్తున్నది. లిక్విడ్స్, నోట్లు, ఇతర ఆధారాలతో రెడ్హ్యాండెడ్గా పట్టుకుంటూ ప్రభుత్వ అధికారుల వెన్నులో వణుకు పుట్టిస్తున్నది. కోర్టుకు సమర్పించేందుకు రహస్యంగా వీడియోలు సైతం తీస్తున్నది. దీంతో ‘ఇంత సులువుగా ఎలా దొరికిపోయామా?’ అని అధికారులే బోరున విలపిస్తున్నారు. అరెస్టులతో సరిపెట్టకుండా.. వెంటనే వారి ఆస్తులు, బినామీల వివరాలు ఆరా తీసి, వారి ఇండ్లలో సోదాలు చేపడుతున్నది. లంచావతారాలు అక్రమంగా సంపాదించిన డబ్బులు, బంగారం, భూములు, స్థిర, చరాస్తులను లెక్కకట్టి కోర్టుకు వివరిస్తున్నది. పక్కా ఆధారాలు సమర్పించడంతో కోర్టు సైతం శిక్షలు విధిస్తున్నది.
అవినీతి బండారం బయటపెడుతూ..
ఇటీవలి కాలంలో ఏసీబీ డీల్ చేసిన కేసుల్లో పెద్ద అవీనితి తిమింగలాలే ఉన్నాయి. హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ, అతని బినామీలైన కుటుంబసభ్యులు, ఇతర హెచ్ఎండీఏ అధికారుల అవినీతి బండారాన్ని ఏసీబీ బయటపెట్టింది. ఆ తర్వాత గిరిజన సంక్షేమ శాఖ ఇంచార్జి సూపరింటెండెంట్ ఇంజినీర్ (ఎస్ఈ) కే జగజ్యోతి ఇంట్లో వజ్ర వైఢ్యూర్యాలతో పాటు.. తీరొక్క నగలు, వడ్డాణాలు, బంగారు గొలుసులు, రత్నాలు పొదిగిన ఆభరణాలు.. మరెన్నో నగలను ఏసీబీ స్వాధీనం చేసుకుంది. సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ ప్రజాదరణ పొందిన ములుగు ప్రభుత్వ అధికారి తస్లీమా వంటి వారి లంచావతారాన్ని నిరభ్యంతరంగా బయటి ప్రపంచానికి బయల్పరిచింది. గత ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన గొర్ల పంపిణీలో అక్రమాలకు పాల్పడిన పశు సంవర్ధశాఖ అధికారుల అవినీతి బాగోతాన్ని కూడా ఏసీబీ బయటపెట్టింది.
24 గంటల అందుబాటులో కాల్సెంటర్
తెలంగాణ అవినీతి నిరోధక శాఖ హెల్ప్లైన్ నంబర్ 1064 సేవలు సైతం 24 గంటలు అందుబాటులో ఉండేలా ఏసీబీ డీజీ సీవీ ఆనంద్ చర్యలు తీసుకున్నారు. ఏసీబీ హెల్ప్ డెస్క్ (కాల్ సెంటర్) కోసం ప్రత్యేకంగా గది, ఇతర సదుపాయాలు కల్పించి.. ప్రత్యేకంగా ఇద్దరు అదనపు సిబ్బందిని నియమించారు. సీవీ ఆనంద్ డీజీగా రాకముందు పనిదినాల్లో ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5.30 వరకు మాత్రమే హెల్ప్లైన్ సేవలు అందుబాటులో ఉండేవి. సీవీ ఆనంద్ రాకతో 24/7 హెల్ప్లైన్ను అందుబాటులోకి తెచ్చారు. ఏసీబీ అవసరం ఉన్న ఫిర్యాదులను వెంటనే స్వీకరించి.. తక్షణ చర్యలు తీసుకుంటున్నారు. లంచం కోసం అధికారులు వేధిస్తే.. తమకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇకనైనా అధికారుల్లో మార్పు రావాలని.. ప్రభుత్వ ఆఫీసుల్లో ‘ఇక్కడ లంచం తీసుకోబడదు’ అనే బోర్డులు పెట్టించే దిశగా అడుగులు వేయాలని, ప్రభుత్వ పాలనను ప్రజలకు సక్రమంగా అందించాలని ఆయన కోరుతున్నారు.