దేశంలోనే అత్యధిక నదులు మహారాష్ట్రలో ప్రవహిస్తున్నాయి. గోదావరి, కృష్ణా, ప్రవర, పూర్ణ, పెన్గంగ, వెన్గంగ, వార్దా, పంచగంగ, ఘటప్రభ, మంజీర, భీమా, ప్రాణహిత, ఇంద్రావతి.. చిన్నచిన్న నదులు అనేకం ఉన్నాయి. అయినా రాష్ట్రంలో నీటి కష్టాలు ఎందుకుండాలి?
‘మహారాష్ట్రలో ఎంతోమంది రైతులు ఆత్మహత్య చేసుకొంటున్నారు. వారిని తలుచుకొంటే దుఃఖం వస్తున్నది. దేశానికి అన్నం పెట్టాల్సిన అన్నదాత.. ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నాడో ఆలోచించాలి. వారిని ఆదుకోవాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చోద్యం చూస్తున్నాయి. అందుకే దేశంలోనే మొట్టమొదటిసారి నేను రైతుల నినాదాన్ని ఎత్తుకొన్నా. ‘అబ్ కీ బార్ .. కిసాన్ సర్కార్’ నినాదంతో కేంద్రంలో రైతు ప్రభుత్వం ఏర్పాటుచేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నా.
-నాందేడ్ సభలో సీఎం కేసీఆర్
కేసీఆర్ తెలంగాణలో ఏం చేస్తున్నడో రోజూ వింటున్నాం. తెలంగాణ రైతులకు ఎంత చేస్తున్నడో చెప్తుంటే ఆశ్చర్యపోతున్నం. మా దగ్గరా నాయకులు ఉన్నారు. ఏండ్ల తరబడి మాటలు చెప్తున్నారు. ఒక్క పనీ చేయడం లేదు. పంటలకు నీళ్లు ఇవ్వాలన్నా కష్టంగా ఉన్నది. కరెంటు ఎప్పుడు ఉంటదో, ఎప్పుడు పోతదో తెలియదు. కేసీఆర్ పాలన మాకు కావాలె. ఈసారి మేము ఆయనకే ఓటేస్తాం.
– నానావతి బచ్చా, రైతు, నాందేడ్ జిల్లా
(నాందేడ్ నుంచి నమస్తే తెలంగాణ ప్రతినిధి): మహారాష్ట్రలోని మరాఠ్వాడ మరుభూమిని తలపిస్తున్నది. మరీ ముఖ్యంగా అక్కడి రైతులు అత్యంత దయనీయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. కరెంటు, సాగునీరు, మద్దతు ధర, ప్రభుత్వ చేయూత లేక అక్కడి రైతాంగం కునారిల్లిపోతున్నది. వ్యవసాయ రంగం సంక్షోభంలో కూరుకుపోయి రైతన్నల ఉసురు తీస్తున్నది. ఫలితంగా ఈ ఒక్క రీజియన్లోనే ఏటా వేలాది మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. వారి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి.
మహారాష్ట్రలోని జాల్నా, ఔరంగాబాద్, పర్బణి, హింగోలి, నాందేడ్, లాతూర్, ఉస్మానాబాద్, బీడ్ జిల్లాలన్నింటినీ కలిపి మరాఠ్వాడా ప్రాంతంగా పిలుస్తారు. ఈ ప్రాంతంలో 2001లో కేవలం ఒకే ఒక రైతు ఆత్మహత్య నమోదు కాగా, 2022లో వెయ్యికి పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారంటే రైతాంగం ఎంతటి దుర్భర స్థితిలో ఉన్నదో అర్థం చేసుకోవచ్చు. అధికారిక లెక్కల ప్రకారమే దశాబ్ద కాలంలో ఒక్క మరాఠ్వాడాలోనే 10,431 మంది రైతులు తమ జీవితాలను అర్ధంతరంగా ముగించుకున్నారు. రైతు ఆత్మహత్యలపై ఏకంగా సినిమాలే తీశారంటే అక్కడి వ్యవసాయరంగం ఎంత సంక్షోభంలో పడిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
ఇందుకు ప్రధాన కారణం మహారాష్ట్ర ప్రభుత్వమని స్థానిక రైతులు, రైతు సంఘాలు చెప్తున్నారు. వ్యవసాయ రంగాన్ని గాడిన పెట్టి రైతు ఆత్మహత్యలను నివారించాల్సిన మహారాష్ట్ర ప్రభుత్వం ఆ పని చేయకుండా, ఆత్మహత్యల నివారణకు కౌన్సిలింగ్ నిర్వహిస్తుండటం శోచనీయం. మరో విచారకరమైన విషయమేమంటే, ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబానికి నామమాత్రంగా ఇచ్చే లక్ష రూపాయలకు కూడా ప్రభుత్వం సవాలక్ష షరతులను విధిస్తున్నది.
కేసీఆర్ ఆనా.. దేశ్ కో బదల్నా
మరాఠ్వాడాలో ఇప్పుడు ఎక్కడా చూసినా ఇదే నినాదం వినిపిస్తున్నది. ఇటీవలే నాందేడ్లో సీఎం కేసీఆర్ నిర్వహించిన సభకు అనూహ్య స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. సంక్షోభంలో కూరుకుపోయిన మరాఠ్వాడా రైతాంగం బీఆర్ఎస్ సభకు పెద్ద ఎత్తున హాజరైంది. కష్టాల కడలిలో పడి మునకలేస్తున్న మరాఠా రైతులకు బీఆర్ఎస్ సభ నూతనోత్తేజాన్ని ఇచ్చింది. తెలంగాణలో అమలవుతున్న రైతు సంక్షేమ పథకాలన్నింటినీ తెలుసుకున్న ఇక్కడి రైతులు అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ అన్న బీఆర్ఎస్ పిలుపునకు విశేషంగా ఆకర్షితులయ్యారు.
అందుకే నాడు సభలో ఆద్యంతం ఇదే నినాదాన్ని హోరెత్తించారు. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్తు, రైతుబంధు, రైతుబీమా లాంటి పథకాలు, కాళేశ్వరం లాంటి సాగునీటి ప్రాజెక్టులు తెలంగాణలో సాధ్యమైనప్పుడు మహారాష్ట్రలో ఎందుకు కావు అని కేసీఆర్ సంధించిన ప్రశ్న మరాఠా రైతుల మెదళ్లను తొలిచేస్తున్నది. కేసీఆర్ సారథ్యంలో బీఆర్ఎస్ వెంట నడవటమే తమ తక్షణ కర్తవ్యమని భావిస్తున్నారు. కేవలం ఎనిమిదేండ్ల కాలంలోనే అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన కేసీఆర్ కన్నా రైతు పక్షపాతి మరెవరు? అనే చర్చ మరాఠ్వాడా రైతాంగంలో మొదలైంది.
ఇప్పటికే తెలంగాణకు సరిహద్దులో ఉన్న నాందేడ్ జిల్లాతోపాటు సౌత్, నార్త్, బోకర్, నయాగాం, ముద్ఖేడ్ దెగ్లూరు, లోహా నియోజకవర్గాలు, కిన్వట్, ధర్మాబాద్ పట్టణాలు, ముద్ఖేడ్ నయాగాం, బిలోలి, ఉమ్రి, హిమాయత్నగర్ తదితర మండలాల్లోని రైతులు నిత్యం ఈ విషయాలే మాట్లాడుకుంటున్నారు. రైతుబంధు పేరిట పంట పెట్టుబడి కోసం ప్రతి రైతుకు కేసీఆర్ పదివేల ఆర్థిక సాయం చేస్తుంటే.. మరాఠా రైతు మాత్రం అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి, ఆరుగాలం శ్రమించి, చాలీచాలని కరెంటుతో, సాగునీరు లేక పంటలు పండించుకోలేక, తెచ్చిన అప్పులు కట్టలేక చివరకు ఉసురు తీసుకుంటున్నాడు. ఈ నేపథ్యంలోనే మరాఠా రైతు చూపు బీఆర్ఎస్ వైపు మళ్లింది. అందుకే కేసీఆర్ ఆనా.. దేశ్ కో బదల్నా అని నినదిస్తున్నారు.
రైతు ఆత్మహత్యలకు ప్రధాన కారణాలు
మరాఠ్వాడాలో రైతు ఆత్మహత్యలు
ఏడాది : ఆత్మహత్య
2022 : 1,023
2021 : 887
2020 : 773
2019 : 937
2018 : 676
కేసీఆర్ లాంటి నాయకుడు కావాలి
నాకు 4.5 ఎకరాల భూమి ఉంది. ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందదు. కిసాన్ సమ్మాన్ నిధి మూడు విడతల్లో రూ.6 వేలు అందిస్తున్నా, పెరిగిన ఖర్చులకు అదీ ఎటూ సరిపోవడం లేదు. తెలంగాణ సీఎం కేసీఆర్ సార్ రైతులను అన్ని విధాలా ఆదుకుంటున్నాడు. రైతుల కోసం ఏం చేశారో వింటున్నాం. మీటింగ్లో కూడా చెప్పారు. టైముకు కరెంటు, కావాల్సినన్ని సాగునీళ్లు ఇస్తే చాలు. రైతుకు అంతకంటే ఏం కావాలి? కేసీఆర్ సాబ్ అది చేస్తున్నారు. ఏదైనా కారణంతో చనిపోతే రైతు కుటుంబాలకు రూ.5 లక్షలు ఇవ్వడం గొప్ప విషయం. నాయకుడంటే కేసీఆర్. ఇప్పుడు మా దగ్గరికి కూడా కదలిరావడం ఆనందంగా ఉంది.
– గోవింద బార్ష, రైతు, డైబర్, నాందేడ్ జిల్లా
కేసీఆర్ గొప్పోడు
మాది కరువు జిల్లా. వర్షాలు సరిగా పడక పంటలకు నీరందడం లేదు. అష్టకష్టాలు పడుతున్నాం. మా దగ్గరి రైతులు దిక్కుతోచని పరిస్థితుల్లో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఏండ్లుగా మా నాయకులకు మొరపెట్టుకుంటున్నాం. మాటలు చెబుతారు. అంతే ఏమాత్రం కనికరం లేదు. టైముకు నీళ్లు, కరెంటు, కల్తీ లేని విత్తనాలు అడుగుతున్నం. అవి కూడా ఇవ్వడం లేదు. ఎన్నో తిప్పలు పడి పంట పండిస్తే రేటు ఉండదు. ప్రభుత్వమేమో కొనదు. మళ్లీ దళారులదే రాజ్యం. తెలంగాణలో కేసీఆర్ రైతులకు ఎంతో చేస్తున్నారు. ఆయన చాలా గొప్పోడు. రైతుల వెంటే నిలుస్తున్నడు. మాకూ కేసీఆర్ కావాలె, ఆయన పథకాలు కావాలె.
– కుల్షన్సింగ్ రాథోడ్
కేసీఆర్ది రైతు రాజ్యం
మా కష్టాలు ఎన్ని చెప్పుకున్నా తక్కువే. నాసిరకం విత్తనాలు, ఎరువులు కూడా అధిక ధరలకు అమ్ముతున్నా కొంటున్నామంటే అర్థం చేసుకోండి. ఇక్కడ రైతు బతకలేని పరిస్థితి. వేరే పని చేసుకోలేం. నీళ్లు ఉండవు. కరెంటు సక్కగ రాదు. పెండ్లికి, ఇంటి ఖర్చులకు, పిల్లల చదువులకు అన్నింటికీ వ్యవసాయమే ఆధారం. మాటలు చెబుతరు కానీ మా నాయకులు ఒక్క పని చేయరు. పంటలకు ధర ఉండదు. మా ఆదాయం పెరగదు. ప్రభుత్వం ఆదుకోదు. తెలంగాణలో ఉన్నది కిసాన్ సర్కారు. మాకు అలాంటి సర్కార్ కావాలె.
– ఉత్తమ్సింగ్ రాథోడ్ (నాందేడ్)