జడ్చర్లటౌన్, జనవరి 22: కల్లు గీతా కార్మికులకు టీఎఫ్టీ లైసెన్స్ జారీ విషయంలో లంచం తీసుకుంటూ ఆబ్కారీ సీఐ ఏసీబీ అధికారులకు చిక్కాడు. ఈ ఘటన మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల ఆబ్కారీ కార్యాలయంలో సోమవారం చోటుచేసుకున్నది. మహబూబ్నగర్ ఏసీబీ డీఎస్పీ బీ శ్రీకృష్ణగౌడ్ మీడియాకు వివరాలు వెల్లడించారు. భూత్పూర్ మండలం పోతులమడుగుకు చెందిన రేకుల తిరుపతయ్యగౌడ్, ఆయన కుమారులు శ్రీకాంత్గౌడ్, శ్రీహరిగౌడ్ కల్లు గీతా కార్మికుల టీఎఫ్టీ లైసెన్స్ కోసం ఈ నెల 17న మహబూబ్నగర్ ఏఈఎస్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నారు. ఇందుకుగానూ ఈ నెల 18న జడ్చర్ల మండలం గొల్లపల్లి గ్రామ శివారులో ఎక్సైజ్ అధికారులు టీఎఫ్టీ లైసెన్స్ కోసం పరీక్షలు నిర్వహించారు. లైసెన్స్ జారీ విషయంలో జడ్చర్ల ఎక్సైజ్ సీఐ బాలాజీ రూ.90 వేలు లంచం డిమాండ్ చేశాడు. వాటిలో అడ్వాన్స్ కింద రూ.25 వేలను ఈ నెల 19న ఇచ్చారు. మిగతా డబ్బుల కోసం సీఐ బాలాజీ ఒత్తిడి తీసుకురాగా.. బాధితులు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఏసీబీ అధికారుల సూచన మేరకు.. తిరుపతయ్యగౌడ్ సోమవారం సాయంత్రం జడ్చర్ల ఆబ్కారీ కార్యాలయానికి వెళ్లి సీఐ బాలాజీని కలిసి రూ.65 వేలు ఇస్తుండగా ఏసీబీ డీఎస్పీ శ్రీకృష్ణగౌడ్, సీఐలు లింగస్వామి, అబ్దుల్ఖాదర్జిలానీ, సిబ్బంది రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. రూ.65 వేలు స్వాధీనం చేసుకున్నామని, సీఐని ఏసీబీ నాంపల్లి కోర్టులో హాజరుపరుస్తామని డీఎస్పీ బీ శ్రీకృష్ణగౌడ్ తెలిపారు. సీఐ ఆస్తులపై కూడా విచారణ చేపడతామని వివరించారు.