హైదరాబాద్, డిసెంబర్ 21 (నమస్తే తెలంగాణ) : కామన్ అడ్మిషన్ టెస్ట్2022 ఫలితాల్లో తెలంగాణ విద్యార్థులు సత్తా చాటారు. ఇద్దరు విద్యార్థులు 100 పర్సంటైల్, మరో విద్యార్థిని 99.99 పర్సంటైల్ సాధించారు. ఐఐఎంలు సహా ఇతర విద్యాసంస్థల్లోని మేనేజ్మెంట్ ప్రోగ్రామ్లలో ప్రవేశాల కోసం నిర్వహించిన కామన్ అడ్మిషన్ టెస్ట్2022 (క్యాట్ ) ఫలితాలు బుధవారం విడుదల చేశారు. జాతీయస్థాయిలో 11 మంది అబ్బాయిలు 100 పర్సంటైల్ దక్కించుకొన్నారు. వీరిలో తెలంగాణకు చెందినవారు ఇద్దరు విద్యార్థులున్నారు. జాతీయంగా 22 మంది విద్యార్థులు 99.99 పర్సంటైల్ సాధించారు. వీరిలో 21 మంది అబ్బాయిలుండగా, ఒక్క అమ్మాయి 99.99 పర్సంటైల్ను కైవసం చేసుకొన్నారు. జాతీయస్థాయిలో క్యాట్ ఎగ్జామ్ నవంబర్ 27న నిర్వహించారు. 2 .22 లక్షల మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు.
బీటెక్ పూర్తిచేసిన వారు ఎంటెక్, పీహెచ్డీ లేదా ఏదైనా ఉద్యోగంలో చేరడం సహజం. కానీ ఇందుకు భిన్నంగా మేనేజ్మెంట్ కోర్సుల వైపు బీటెక్ విద్యార్థులు ఆకర్షితులవుతున్నారు. సాధారణంగా ఎంబీఏ, మేనేజ్మెంట్ ప్రోగ్రాముల్లో బీకాం, ఎంకామ్ వంటి కోర్సుల విద్యార్థులు చేరుతుంటారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఈ ఏడాది క్యాట్లో 11 మంది విద్యార్థులు 100 పర్సంటైల్ సొంతం చేసుకోగా, వీరంతా ఇంజినీరింగ్ విద్యార్థులు కావడం గమనార్హం. ఒక్కరే నాన్ ఇంజినీరింగ్ విద్యార్థి ఉన్నారు.