మహబూబాబాద్ : రాష్ట్రంలో ఆసరా పెన్షన్ల సంఖ్య అరకోటికి చేరింది. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఈ స్థాయిలో పెన్షన్స్ ఇస్తున్న దాఖలాలు లేవు. ఇది తెలంగాణ ప్రభుత్వం ఘనత అని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.
మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంవెలికట్ట గ్రామంలో లబ్ధిదారులకు ఆసరా పెన్షన్ గుర్తింపు కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. తెలంగాణ రాకముందు 20 లక్షలుగా ఉన్న పెన్షన్ల సంఖ్యను తెలంగాణ వచ్చాక 40 లక్షలకు పెంచాలరని మంత్రి తెలిపారు.
తాజాగా 65 సంవత్సరాల వయసు నుంచి 57 సంవత్సరాలకు ఇస్తూ సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం కారణంగా మరో 10 లక్షల మందికి కొత్తగా పెన్షన్లు మంజూరైనట్లు మంత్రి తెలిపారు. ఈ మొత్తం సంఖ్య యాభై లక్షలకు చేరిందని మంత్రి స్పష్టం చేశారు.
కేంద్రం రూ.200 కోట్లు మాత్రమే ఇస్తూ ఆరు లక్షల మందికి పెన్షన్లు అందజేస్తుందని, అదే తెలంగాణ ప్రభుత్వం 50 లక్షల మందికి ఏడాదిన రూ. 1200 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తుందని మంత్రి వివరించారు.
ఉమ్మడి రాష్ట్రంలో రూ.200 రూపాయలకు మించని పెన్షన్ ని రెండుసార్లు పెంచి వృద్ధులకు, ఇతరులకు రూ.2,016, దివ్యాంగులకు రూ.3,016 ఇస్తున్నామన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో 100 నుంచి 500కు మించడం లేదని మంత్రి పేర్కొన్నారు.
రాష్ట్రంలో వినూత్నంగా రూపొందించి అమలు చేస్తున్న అన్ని పథకాలకు మానవీయ కోణాన్ని జత చేశారని, అందులో భాగంగా పింఛన్దారులకు గతంలో ఎప్పుడు ఎక్కడ లేని విధంగా పెన్షన్లు అందజేస్తున్నారని అన్నారు.