న్యూఢిల్లీ, ఏప్రిల్ 8 (నమస్తే తెలంగాణ): ప్రధాని మోదీ డిగ్రీ సర్టిఫికెట్లను చూపేందుకు గుజరాత్ వర్సిటీకి ఎందుకంత భయం? అని ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత, ఎంపీ సంజయ్సింగ్ ప్రశ్నించారు. అసలు ఆ వర్సిటీలో మోదీ చదువుకొని ఉంటే ఖుషీగా సర్టిఫికెట్లు చూపించవచ్చు కదా? అని అడిగారు. న్యూ ఢిల్లీలోని తన నివాసంలో శనివారం ఆయన ‘నమస్తే తెలంగాణ’తో మాట్లాడారు. తమ దగ్గర చదువుకున్న వ్యక్తి ఉన్నతస్థితికి ఎదిగితే ఆ కాలేజీ, యూనివర్సిటీ గర్వపడతాయని, తమ స్టూడెంట్ అని గొప్పగా చెప్పుకొంటాయని అన్నారు.
మోదీ ఒకవేళ గుజరాత్ విశ్వవిద్యాలయంలో చదువుకొని ఉంటే ఆ వర్సిటీ గర్వంగా చెప్పుకోవాలని, మోదీ సర్టిఫికెట్లను ముందుకొచ్చి చూపించాలని కోరారు. కానీ, ఇందుకు భిన్నంగా గుజరాత్ వర్సిటీ వ్యవహరిస్తున్నదని చెప్పారు. మోదీ సర్టిఫికెట్లు చూపించాలని కోరినందుకు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు గుజరాత్ హైకోర్టు రూ.25వేల జరిమానా విధించిందని, ఈ వ్యవహారంలో కేజ్రీవాల్పై బీజేపీవాళ్లు ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామనడం హాస్యాస్పదంగా ఉన్నదని అన్నారు. ప్రధాని డిగ్రీ నకిలీది కావడంవల్ల దేశం నవ్వులపాలు అవుతున్నదని ఎద్దేవా చేశారు.