యాచారం, జూన్ 19 : కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం ఫార్మాసిటీని వెంటనే రద్దు చేయాలని సుప్రీంకోర్టు న్యాయవాది, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి ప్రియాంక కక్కర్ డిమాండ్ చేశారు. రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలోని ఫార్మాసిటీ భూములను శుక్రవారం ఆమె పరిశీలించారు. ప్రభుత్వం చట్ట వ్యతిరేక పనులకు పాల్పడుతున్నట్టు రైతులు ఆమె దృష్టికి తీసుకెళ్లారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మోసాలను వివరించారు. ఫార్మాసిటీని రద్దు చేయాలని, ఆ భూములను తిరిగి రైతులకు ఇవ్వాలని గత ప్రభుత్వ హయాంలో కాంగ్రెస్ నాయకులు పాదయాత్ర చేసిన విషయాన్ని ఆమె దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ప్రియాంక కక్కర్ మాట్లాడుతూ.. కోర్టు స్టే ఉన్న భూముల్లో పోలీసుల అండదండలతో పనులు చేయడం చట్ట వ్యతిరేకమని అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఫార్మా బాధిత రైతులను మోసం చేసిన తీరును ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీతో చర్చిస్తానని తెలిపారు. రైతులకు ఫ్యూచర్లేని ఫ్యూచర్సిటీ ఎందుకని ఆమె ప్రశ్నించారు. రైతులను నమ్మించి మోసం చేసిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, మంత్రులు సీతక్క, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, ఎమ్మెల్సీ కోదండరాంపై ఫిర్యాదు చేయనున్నట్టు తెలిపారు. ఫార్మా బాధిత రైతులకు న్యాయం చేసేందుకు అన్ని విధాలుగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. సరస్వతి, గణేశ్, సందీప్రెడ్డి, మహిపాల్రెడ్డి, బల్వంత్రెడ్డి, శ్రీనివాస్రెడ్డి పాల్గొన్నారు.