ప్లకార్డులతో వెల్లోకి దూసుకెళ్లి ఆందోళన నిరసన నినాదాలతో హోరెత్తుతున్న సభలు బీఆర్ఎస్తో కలిసి వస్తున్న ఇతర పార్టీలుఇది దుర్మార్గ అప్రజాస్వామిక ప్రభుత్వం బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కేకే నిగ్గుతేలే దాకా వదిలే ప్రసక్తే లేదు:నామా
దేశ ఆర్థిక వ్యవస్థను భ్రష్టుపట్టించి భారతప్రతిష్ఠను దిగజార్జిన అదానీ వ్యవహారంపై చర్చ కోసం బీఆర్ఎస్ ఎంపీలు పట్టు వదలకుండా వరుసగా పార్లమెంట్లో ఆందోళన చేస్తున్నారు. ప్రతిరోజూ వాయిదా తీర్మానాలు ఇస్తూ.. వెల్లోకి దూసుకెళ్తూ.. ఆపై సభల నుంచి వాకౌట్ చేసి వచ్చి పార్లమెంట్ ఆవరణలో గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేస్తున్నారు
హైదరాబాద్, ఫిబ్రవరి 10 (నమస్తే తెలంగాణ): దేశ ఆర్థిక వ్యవస్థను భ్రష్టు పట్టించి ప్రపంచంలో భారత ప్రతిష్ఠను దిగజార్చిన అదానీ గ్రూపు సంస్థల నిర్వాకంపై పార్లమెంట్లో చర్చించాలని బీఆర్ఎస్ ఎంపీలు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుత బడ్జెట్ సమావేశాల్లో వరుసగా 7 రోజులపాటు అటు రాజ్యసభలో, ఇటు లోక్సభలో బీఆర్ఎస్ ఆందోళన కొనసాగిస్తున్నది. శుక్రవారం పార్లమెంట్ ఉభయ సభలు ప్రారంభం కాగానే హిండెన్బర్గ్ నివేదికపై చర్చ కోసం రాజ్యసభలో బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు, దిగువ సభలో బీఆర్ఎస్ లోక్సభాపక్షా నేత నామా నాగేశ్వరరావు మరోసారి వాయిదా తీర్మానాలకు పట్టుబట్టారు. ఈ నోటీసులను ఉభయ సభల్లో తిరస్కరించటంతో కేంద్రానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ సభ్యులు నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు. ఈ ఆందోళనకు కాంగ్రెస్ సహా ఇతర విపక్ష పార్టీలు మద్దతు పలికాయి. అయినా చర్చకు అనుమతి ఇవ్వకపోడంతో బీఆర్ఎస్ ఎంపీలు ఉభయ సభల నుంచి వాకౌట్ చేసి, పార్లమెంట్ ప్రాంగణంలోని గాంధీవిగ్రహం వద్ద ధర్నాకు దిగారు.
కేంద్రంపై బీఆర్ఎస్ ఆగ్రహం
అదానీ గ్రూపు సంస్థల అక్రమాలపై విచారణకు సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)ని వేయాలని, లేదంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తితో విచారణ జరపాలని బీఆర్ఎస్ వీరోచిత పోరాటం చేస్తున్నది. దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతున్న అదానీ వ్యవహారంపై చర్చకు కేంద్రం మీనమేషాలు లెక్కిస్తున్నదని పార్టీ ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజాసమస్యలపై చర్చించేందుకు ఉభయ సభల్లో అన్ని పార్టీలకూ అవకాశమిస్తామని పార్లమెంట్ సమావేశాల ప్రారంభానికి ముందు అఖిలపక్ష భేటీలో హామీ ఇచ్చిన కేంద్రం.. ఇప్పుడు అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నదని కేకే, నామా మండిపడుతున్నారు. అందుకే భావసారూప్య పార్టీలను ఏకం చేసి కేంద్రంపై పోరాడుతున్నామని, అందులో భాగంగానే రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించామని తెలిపారు. ప్రజాసమస్యల పరిష్కారమే ముఖ్యమని, అందుకే బడ్జెట్పై చర్చలో పాల్గొనటం లేదని స్పష్టం చేశారు. ఈ పోరాటాన్ని చూసి భావసారూప్య పార్టీలు అబ్బురపడుతున్నాయి. ఏ పార్టీ ఎంపీలైనా తమ సొంత రాష్ర్టాలకు సంబంధించిన అంశాలపై చర్చకోసం పార్లమెంట్లో ఆందోళనకు దిగడం సాధారణమేనని, కానీ యావత్ దేశ ప్రయోజనాల కోసం బీఆర్ఎస్ నిరసనకు దిగడం గొప్ప విషయమని వివిధ పార్టీలకు చెందిన పలువురు సీనియర్ ఎంపీలు ప్రశంసించడం విశేషం.
ప్రధానికి బీఆర్ఎస్ నిరసన సెగ
బీఆర్ఎస్ నిరసన సెగ ప్రధాని మోదీని తాకింది. బడ్జెట్పై బుధవారం ఆయన లోక్సభలో ప్రసంగం మొదలుపెట్టగానే హిండెన్బెర్గ్ నివేదికపై చర్చించాలని, జేపీసీ వేయాలని బీఆర్ఎస్ పక్ష నేత నామా నాగేశ్వర్రావు నినాదాలు చేయటం.. మిగిలిన సభ్యులు ప్లకార్డులు చేబూని వెల్లోకి దూసుకుపోవడంతో సభలో తీవ్ర గందరగోళం నెలకొన్నది. అయినా ఈ అంశంపై చర్చకు స్పీకర్ అనుమతించకపోవడంతో సభ నుంచి బీఆర్ఎస్ సభ్యులు వాకౌట్ చేయడం, వారిని ఇతర విపక్షాల ఎంపీలు అనుసరించటం తెలిసిందే. ఇదేవిధంగా గురువారం రాజ్యసభలో మోదీ ప్రసంగాన్ని మొదలుపెట్టగానే అదానీ వ్యవహారంపై బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కేకే వాయిదా తీర్మానానికి పట్టుబట్టారు. జేపీసీ ఏర్పాటుకు ఎందుకు జంకుతున్నారని కేంద్రాన్ని నిలదీశారు. అనంతరం బీఆర్ఎస్ ఎంపీలు నినాదాలు చేస్తూ వెల్లోకి దూసుకెళ్లి ప్లకార్డులతో ఆందోళనకు దిగారు. సభలో బైఠాయించి నిరసన వ్యక్తం చేయడంతో కాంగ్రెస్, ఆప్, డీఎంకే తదితర విపక్షాల ఎంపీలు కలిసివచ్చారు. శుక్రవారం సైతం బీఆర్ఎస్ ఇదే ఒరవడిని కొనసాగించింది.
జేపీసీ వేయమంటే జంకెందుకు?
దేశ ఆర్థిక వ్యవస్థను నిర్వీర్యం చేస్తున అదానీ గ్రూపు సంస్థలపై సమగ్ర విచారణ జరపాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తున్నది. అందుకోసం జేపీసీని వేయాలని, లేదంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలని కోరుతున్నది. ఈ విషయంలో కేంద్రం ఎందుకు జంకుతున్నదో అర్థం కావడం లేదు. నా రాజకీయ జీవితంలో ఇంతటి దుర్మార్గ, అప్రజాస్వామిక ప్రభుత్వాన్ని ఎన్నడూ చూడలేదు.
– కే కేశవరావు,బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత
వదిలే ప్రసక్తే లేదు
దేశ సమస్యలపై బీఆర్ఎస్ వరుసగా ఆందోళన చేపడుతున్నా కేంద్రానికి చీమకుట్టినట్టయినా లేదు. ఆ సమస్యలపై చర్చించకుండా నరేంద్ర మోదీ సర్కార్ పారిపోతున్నది. దీనిపై భావసారూప్య పార్టీలతో కలసి పోరాడుతున్నాం. కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలు, కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తున్న తీరుపై మా పోరాటం ఆగదు. అదానీ వ్యవహారం నిగ్గుతేలేదాకా మోదీ సర్కార్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు.
– నామా నాగేశ్వరరావు,బీఆర్ఎస్ లోక్సభాపక్ష నేత