‘ఆమె.. ఆకాశం’ పుస్తకావిష్కరణ సభలో దర్శకుడు త్రివిక్రం
హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 26 : డాక్టర్ ముప్పవరపు నిశ్చిత రాసిన ‘ఆమె..ఆకాశం’ పుస్తకం తేలికగానే ఉన్నా, భావం మాత్రం బరువుగానే ఉన్నదని ప్రముఖ సినీ దర్శకుడు త్రివిక్రం శ్రీనివాస్ పేర్కొన్నారు. శనివారం బంజారాహిల్స్లోని పార్క్ హయత్ హోటల్లో సినీ దర్శకుడు త్రివిక్రం శ్రీనివాస్, మాజీ ఎంపీ సుబ్బరామిరెడ్డి, హిందూ ధర్మ ప్రచార పరిషత్ చైర్మన్ గోవింద్హరి, ప్రముఖ వాద్య సంగీతకారుడు శివమణి, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా త్రివిక్రం మాట్లాడుతూ.. కాలంతో పాటు ధర్మం మారుతున్నా, సత్యం మాత్రం ఎప్పటికీ అలాగే ఉండిపోతుందని, సమాజంలోని సంఘర్షణ మనిషిలోనూ వేళ్లూనుకుంటుందని పేర్కొన్నారు. సుబ్బరామిరెడ్డి, గోవింద్హరి మాట్లాడుతూ.. ఈ పుస్తకం సమాజంలో మహిళల ప్రాధాన్యతను చాటి చెప్పిందని పేర్కొన్నారు. రచయిత్రి డాక్టర్ నిశ్చిత మాట్లాడుతూ.. వైద్యురాలిగా కొనసాగుతూ మహిళా కోణంలో పుస్తకం రాయడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని పేర్కొన్నారు. పుస్తకానికి ముందుమాటను ప్రముఖ రచయిత్రి ఓల్గా రాశారు. కార్యక్రమంలో ప్రముఖ చిత్రకారుడు ఏలె లక్ష్మణ్, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.