బంజారాహిల్స్, డిసెంబర్ 26: మాజీ ప్రియుడిని డ్రగ్స్ కేసులో ఇరికించి పగ తీర్చుకోవాలని స్కెచ్వేసి అతడి కారులో గంజాయి పెట్టి పోలీసులకు పట్టించిన యువతి ప్లాన్ బెడిసి కొట్టి కటకటాలపాలైంది. సినీఫక్కీలో జరిగిన ఈ ఘటనను జూబ్లీహిల్స్ పోలీసులు ఛేదించారు. పోలీసుల వివరాల ప్రకారం.. సరూర్నగర్కు చెందిన కాశగోని శ్రవణ్కుమార్ (30) అమీర్పేటలోని ప్రైవేటు బ్యాంకులో లోన్స్ విభాగంలో పని చేస్తుంటాడు. రహ్మత్నగర్కు చెందిన విశ్రాంత ఏఎస్ఐ కుమార్తె అదోక్షజ అలియాస్ రింకీ అలియాస్ రీనా (28) మూడేండ్ల క్రితం శ్రవణ్తోపాటు పనిచేసే క్రమంలో ప్రేమలో పడింది.
ఇద్దరూ రెండున్నరేండ్లు ప్రేమించుకున్నారు. ప్రస్తుతం ఎల్ఎల్బీ ఫైనల్ ఇయర్ చదువుతున్న రింకీ శ్రవణ్కుమార్కు మధ్య ఇటీవల విభేదాలు తలెత్తాయి. తన గురించి స్నేహితులతో చెడుగా చెప్తూ పరువు తీస్తున్నాడని, శ్రవణ్పై రింకీ కక్ష పెంచుకుంది. స్నేహితులతో కలిసి శ్రవణ్ గంజాయి కేసులో ఇరికించాలని ప్లాన్ చేసింది. రింకీ తన బాయ్ఫ్రెండ్ దీపక్ మోహన్తో కలిసి యశ్వంత్ సాయి (21) అనే స్నేహితుడికి డబ్బులు పంపించి 8 గంజాయి ప్యాకెట్లు తెప్పించారు.
రహ్మత్నగర్కు చెందిన కామన్ ఫ్రెండ్తో ఫోన్ చేయించి శ్రవణ్ను కృష్ణకాంత్ పార్క్ వద్దకు పిలిపించారు. తన ఫ్రెండ్ కారు తీసుకొచ్చిన శ్రవణ్ను జూబ్లీహిల్స్లోని అమ్నేషియా పబ్కు వెళ్లి అక్కడ మాట్లాడుకుందామని కామన్ ఫ్రెండ్ స్నేహితులు నమ్మబలికారు. శ్రవణ్ కారులోనే అతడితోపాటు దీక్షిత్రెడ్డి, ప్రణీత్ గోపి (20), సూర్యతేజ (22) ఎక్కారు. పబ్కు వచ్చిన వారందరూ 20 నిమిషాలపాటు బీర్లు తాగారు. రింకీ కాసేపటి తర్వాత వాష్రూమ్ వెళ్తున్నానని చెప్పి పబ్ నుంచి కిందకు వచ్చేసింది. పబ్ వద్ద పార్క్చేసిన శ్రవణ్కుమార్ అనే వ్యక్తికి చెందిన కారులో డ్రగ్స్ ఉన్నాయంటూ పోలీసులకు ఫోన్ చేసింది.
పోలీసులు అక్కడకు చేరుకొని శ్రవణ్ పిలిపించి అతడి సమక్షంలో తనిఖీలు చేయగా కారు సీట్ల కింద పెట్టిన 8 గంజాయి ప్యాకెట్లు లభించాయి. షాక్కు గురైన శ్రవణ్ తనకేమీ తెలియదని, తనతోపాటు కారులో వచ్చిన వ్యక్తులు గంజాయి ప్యాకెట్లు పెట్టి ఉంటారని చెప్పాడు. వారికోసం వెతకగా అప్పటికే పబ్ నుంచి వెళ్లిపోయినట్టు తెలిసింది. శ్రవణ్ను పోలీసులు పీఎస్కు తరలించి ప్రశ్నించగా, పబ్కు రావడానికి దారితీసిన పరిస్థితులు, మాజీ ప్రియురాలితో చర్చల కోసం తనకు వచ్చిన ఫోన్కాల్స్, తనతోపాటు వచ్చిన వారి వివరాలను శ్రవణ్ పోలీసులకు విరించారు. మిగతా వారిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా, తమ స్నేహితుడు మహేందర్యాదవ్, రింకీల సూచనల మేరకు తాము శ్రవణ్ కారులో గంజాయి ప్యాకెట్లు పెట్టినట్టు వారు అంగీకరించారు. రింకీతోపాటు ఆమెకు సహకరించిన ఆరుగురిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు.. వారందరినీ మంగళవారం రిమాండ్కు తరలించారు.