కట్టంగూర్, మే 14 : అమెరికాలో ఉన్నత విద్యను పూర్తి చేసి అక్కడే పార్ట్ టైం జాబ్ చేస్తున్న విద్యార్థిని అనారోగ్యంతో మృతి చెందింది. నల్లగొండ జిల్లా కట్టంగూర్ మండలం పందనపల్లికి చెందిన కొండి వెంకట్రెడ్డి, శోభారాణి దంపతులకు రమేశ్రెడ్డి, ప్రియాంక ఇద్దరు సంతానం. వీరిది పూర్తిగా వ్యవసాయ కుటుంబం. తండ్రి వెంకట్రెడ్డి తన కుమార్తె ప్రియాంక (26)ను ఉన్నత చదువుల కోసం అమెరికాకు పంపించాడు. ప్రియాంక 2023లో హంట్స్విల్లే (యూఏహెచ్)లోని యూనివర్సిటీలో చేరి అగ్రికల్చర్ ఎమ్మెస్సీ పూర్తి చేసింది. అక్కడే పార్ట్ టైం జాబ్ చేస్తూ ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నది.
ఈ నెల 4న ప్రియాంక దంత సంబంధిత సమస్యతో దవాఖానకు వెళ్లగా పరీక్షించిన వైద్యులు బ్లడ్లో ఇన్ఫెక్షన్ ఉన్నదని తెలిపారు. ఈ నెల 6న స్నానం చేసేందుకు వెళ్లిన ప్రియాంక బాత్రూంలో పడిపోవడంతో స్నేహితులు దవాఖానకు తరలించారు. అప్పటికే అపస్మారక స్థితిలో ఉన్న ప్రియాంకను పరిశీలించి బ్రెయిన్ డెడ్ అయినట్టు వైద్యులు నిర్ధారించారు. వెంటిలేటర్ అమర్చి ఒక రోజు వైద్యం అందించగా ఈ నెల 8న మృతిచెందింది. దీంతో ప్రియాంక కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. కుటుంబ సభ్యులు బుధవారం ప్రియాంక భౌతికకాయాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చి అంత్యక్రియలు జరిపించారు.