యాదాద్రి భువనగిరి : భువనగిరికి చెందిన ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. రెండు రోజుల క్రితం అదృశ్యమైన ఆ యువకుడు సిద్దిపేటలో శవమై కనిపించాడు. అయితే రెండేండ్ల క్రితం అతను ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఈ హత్యకు ప్రేమ పెళ్లినే కారణమా? లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? అనేది చర్చనీయాంశంగా మారింది. అల్లుడిని మామ చంపాడా? లేక ఇతరులెవరైనా చంపారా? అన్నది మిస్టరీగా మారింది.
వివరాల్లోకి వెళ్తే.. భువనగిరికి చెందిన భార్గవి అనే యువతిని రామకృష్ణ అనే యువకుడు 2020లో ప్రేమ వివాహం చేసుకున్నాడు. రామకృష్ణ హోంగార్డుగా పని చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. అయితే ప్రేమ పెళ్లి చేసుకున్న కూతురిపై తండ్రి వెంకటేశ్ కక్ష పెంచుకున్నాడు. రామకృష్ణను మట్టుబెట్టేందుకు వెంకటేశ్ పలుమార్లు యత్నించినట్లు తెలుస్తోంది.
ఈ పరిణామాల నేపథ్యంలో రెండు రోజుల క్రితం రామకృష్ణ అదృశ్యమయ్యాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పరిచయమైన లతీఫ్ అనే వ్యక్తి రామకృష్ణను హైదరాబాద్కు తీసుకెళ్లాడు. అయితే రామకృష్ణ హత్యకు గురయ్యాడు. అతని డెడ్ బాడీ సిద్దిపేట జిల్లాలో లభ్యమైంది. తన భర్తను హత్య చేశారన్న వార్త భార్గవికి తెలిసింది. దీంతో తన తండ్రి వెంకటేశే.. రామకృష్ణను హత్య చేయించాడని భార్గవి భువనగిరి పోలీసులకు ఫిర్యాదు చేసింది. లతీఫ్ తన భర్తను హైదరాబాద్కు తీసుకెళ్లాడని, అతని పేరును కూడా ఫిర్యాదులో పేర్కొన్నది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
అయితే రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పరిచయమైన లతీఫ్కు భార్గవి తండ్రి వెంకటేశ్ సుపారీ ఇచ్చినట్లు తెలుస్తోంది. లతీఫ్తోనే రామకృష్ణను వెంకటేశ్ హత్య చేయించినట్లు భార్గవి అనుమానిస్తుంది. తనకు ఆరు నెలల బిడ్డ ఉందని భార్గవి బోరుమంది. తన భర్త హత్యకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని ఆమె డిమాండ్ చేస్తోంది.
పోలీసు డిపార్ట్మెంట్లో హోంగార్డుగా పని చేస్తున్న రామకృష్ణ.. గుప్త నిధుల కేసులో గతేడాది సస్పెండ్ అయ్యాడు. దీంతో బతుకుదెరువు కోసం భువనగిరిలోని తాతా నగర్లో ఓ ఇంటిని కిరాయి తీసుకుని, రియల్ ఎస్టెట్ వ్యాపారంలోకి దిగాడు. అలా తన కుటుంబాన్ని రామకృష్ణ పోషించుకుంటున్నాడు.