హైదరాబాద్, జూలై 14 (నమస్తే తెలంగాణ): ముందుచూపు లేకుండా, రాష్ర్టాల అభ్యంతరాలు, విజ్ఞప్తులను పట్టించుకోకుండా కేంద్రం ఏకపక్షంగా తీసుకొచ్చిన రివర్ బోర్డుల గెజిట్కు నేటితో ఏడాది పూర్తయినప్పటికీ సాధించింది శూన్యం. కేంద్ర జల్శక్తి మంత్రిత్వశాఖ ఆదేశాలు ఇవ్వడమే తప్ప, రాష్ర్టాల విజ్ఞప్తులపై స్పందించడం లేదు. దీందో కృష్ణా, గోదావరి రివర్బోర్డులు ఉత్సవవిగ్రహాలుగా మారిపోయాయి. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన తర్వాత కృష్ణా, గోదావరి జలాల పంపిణీ కోసం ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లోని 85 సెక్షన్ ప్రకారం కేంద్రం కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ), గోదావరి రివర్ మేనేజ్మెంబ్ బోర్డు (జీఆర్ఎంబీ)ను ఏర్పాటుచేసింది. చట్టంలోని సెక్షన్ 87 ప్రకారం బోర్డుల పరిధిని నిర్ణయిస్తూ నిరుడు జూలై 15న గెజిట్ నోటిఫికేషన్ జారీచేసింది. రెండు రాష్ర్టాల్లో గోదావరి, కృష్ణా నదులపై ఉన్న ప్రాజెక్టులను బోర్డుల పరిధిలోకి తీసుకెళ్లడం, ప్రాజెక్టుల నిర్వహణ, నీటి విడుదలతో పాటు విద్యుత్తు ఉత్పత్తి అంశాలన్నీ బోర్డుల నియంత్రణలోనే కొనసాగేలా నిబంధనలను విధించింది. గెజిట్ అమలుకు విధించిన ఏడాది గడువు శుక్రవారంతో ముగిసినప్పటికీ గెజిట్ అమలుకు చేపట్టాల్సిన చర్యలపై ఇప్పటివరకు స్పష్టత లేదు.
తెలంగాణ కోరినవన్నీ న్యాయబద్ధమైనవి, ట్రిబ్యునళ్లు తేల్చిచెప్పినవే. రాష్ర్టాల అభ్యంతరాలను పట్టించుకోకుండా ఏకపక్షంగా గెజిట్ విడుదల చేయడం, సమస్యలను పరిష్కరించకుండా తాత్సారం తగదని నిపుణులు సూచిస్తున్నారు. కృష్ణా జలాల అంశాలపై తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి లేఖ లు రాసినప్పటికీ కేంద్రం స్పందించడం లేదు. గోదావరిపై చేపట్టిన ప్రాజెక్టుల డీపీఆర్లను సమర్పించినప్పటికీ ఆమోదించకుండా జాప్యం చేస్తున్నది. కేంద్రం మౌనం, గెజిట్ అమలుకు రాష్ర్టాలు నిరాకరణతో కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ ఉత్సవవిగ్రహాలుగా మిగిలిపోయాయి.