భద్రాద్రి కొత్తగూడెం : ఆమెను చూసి మనసు పారేసుకున్నాడు.. ప్రేమిస్తున్నానని చెప్పాడు.. ఆమె కూడా ఓకే చెప్పేసింది.. సరదాగా సాగుతున్న ప్రేమాయణంలో.. పెళ్లి ముచ్చట్లు కూడా వచ్చాయి.. త్వరలోనే పెళ్లి చేసుకుందామని నమ్మించాడు.. ఆమె ఎగిరి గంతేసింది. సహజీవనం చేద్దామన్నాడు.. ఎలాగైనా పెళ్లి చేసుకుంటాం కదా అని ప్రియుడి కోరికను కాదనలేకపోయింది. ఇద్దరూ కలిసి రెండేండ్ల పాటు సహజీవనం చేశారు. కానీ చివరకు అతను మరొకరిని వివాహం చేసుకున్నాడు. ప్రియురాలికి ఆ విషయం తెలియడంతో తట్టులేకపోయింది. తనకు అన్యాయం జరిగిందని ప్రియుడి ఇంటి ముందు దీక్షకు దిగింది. అతనితో తన పెళ్లి జరిపించాలని డిమాండ్ చేస్తోంది.
వివరాల్లోకి వెళ్తే.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చింతూరు మండలానికి చెందిన జ్యోతి.. కొత్తగూడెంలో ఉంటూ ప్రయివేటు ఉద్యోగం చేస్తోంది. సుజాత నగర్ మండలం రాఘవాపురం గ్రామానికి చెందిన డీ రాజేశ్తో జ్యోతికి పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్త ప్రేమకు దారి తీసింది. ఇద్దరు ప్రేమలో పడ్డారు. పెళ్లి చేసుకుంటానని రాజేశ్ నమ్మించడంతో.. ప్రేమికులిద్దరూ సహజీవనం చేశారు. కానీ చివరకు ప్రేమించిన యువతిని కాదని వేరే అమ్మాయితో శనివారం సాయంత్రం రాజేశ్ పెళ్లి చేసుకున్నాడు.ఈ విషయం తెలుసుకున్న జ్యోతి.. ప్రియుడి ఇంటి వద్దకు చేరుకొని దీక్షకు దిగింది. గత రెండు సంవత్సరాలుగా అన్ని విధాలుగా వాడుకున్న రాజేశ్ తనకు తెలియకుండా వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుని తనను మోసం చేశాడని బాధితురాలు వాపోయింది. తనకు న్యాయం చేయాలని బాధితురాలు డిమాండ్ చేస్తోంది.