హైదరాబాద్ : ఆయన ఓ జాతీయ పార్టీ నాయకుడు.. నాయకుడే కాదు.. ఓ జిల్లాకు అధ్యక్షుడు కూడా. పార్టీ కార్యకర్తలందరికీ ఆదర్శంగా ఉండి, సమాజానికి మంచిని పంచాల్సిన నాయకుడే పాడుపనికి పాల్పడ్డాడు. పార్టీకి చెందిన మహిళా నాయకురాలిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి, లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన నారాయణపేట్ జిల్లాలో వెలుగు చూసింది.
నారాయణపేట్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కుంభం శివకుమార్ రెడ్డి.. సొంత పార్టీకి చెందిన ఓ మహిళతో పరిచయం పెంచుకున్నాడు. పార్టీ కార్యకలాపాలపై తరుచుగా ఆమె శివకుమార్ రెడ్డిని కలుస్తుండటంతో ఇదే అదునుగా భావించి, ప్రేమాయణం కొనసాగించాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి లోబర్చుకున్నాడు. ఇద్దరూ శారీరకంగా కలిసిన సమయంలో ఆమెకు తెలియకుండా శివకుమార్ రెడ్డి వీడియోలను చిత్రీకరించాడు. ఆ వీడియోలతో బ్లాక్ మెయిల్ చేసి పలుమార్లు లైంగికదాడికి పాల్పడ్డాడు.
ఇటీవల నగరంలోని ఓ హోటల్కు ఆమెను పిలిపించి, కూల్డ్రింక్లో నిత్ర మాత్రలు కలిపిచ్చి మరోమారు దారుణానికి పాల్పడ్డాడు. ఎవరికీ ఎలాంటి అనుమానం రాకుండా మెడలో పసుపుతాడు కట్టి కామవాంఛ తీర్చుకున్నాడు. తన భార్య ఆరోగ్యం బాగాలేదని, మూడేండ్ల కంటే ఎక్కువ కాలం బతకలేదని, నిన్నే పెళ్లి చేసుకుంటానని నమ్మబలికాడు. దీంతో పెళ్లి చేసుకోవాలని నిలదీయడంతో శివకుమార్ రెడ్డి తన అనుచరుల చేత బెదిరింపులకు గురి చేస్తుండటంతో చేసేదేమీ లేక పంజాగుట్ట పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేసింది. ఐపీసీ 417, 420, 376, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.