హైదరాబాద్, ఆగస్టు 16 (నమస్తే తెలంగాణ): రోజురోజుకు ఆందోళన కలిగిస్తున్న ఫేక్ సర్టిఫికెట్లను సులభంగా గుర్తించేందుకు ఉన్నత విద్యామండలి రూపొందించిన వెబ్సైట్ త్వరలోనే అందుబాటులోకి రానున్నది. అధికారిక సమాచారం ప్రకారం వారం పది రోజుల్లో వెబ్ పోర్టల్ సేవలు అందించనున్నది. ఈ నెల 18న వెబ్సైట్ను ప్రారంభించాలని నిర్ణయించినా.. డీజీపీ మహేందర్రెడ్డి సెలవులో ఉండటంతో వాయిదావేశారు. ఇటీవలికాలంలో ఫేక్ సర్టిఫికెట్లు భారీగా బయటపడుతున్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాల కోసం పలువురు నకిలీ సర్టిఫికెట్లను సమర్పిస్తున్నారు.
యూనివర్సిటీలు లోగోలు, వాటర్మార్క్, దృఢమైన పేపర్ల వినియోగం వంటి సెక్యూరిటీ ఫీచర్లను వినియోగిస్తున్నాయి. యూనిక్ కోడ్ నంబర్లను సైతం కేటాయిస్తున్నాయి. అయినా ఫేక్ సర్టిఫికెట్ల దందా ఆగడం లేదు. ఆయా సర్టిఫికెట్ల పరిశీలన చేపడుతున్నా కొన్నిసార్లు గుర్తుపట్టలేనంత జాగ్రత్తగా సర్టిఫికెట్లు తయారుచేస్తున్నారు. ఇంకొన్నిసార్లు వర్సిటీలు స్పందించకపోవడం, చొరవ చూపకపోవడంతో పరిశీలన ఆలస్యమవుతున్నది. ఈ నేపథ్యంలో ఒకే ఒక్క క్లిక్తో ఆన్లైన్లో సర్టిఫికెట్లన్నింటినీ పరిశీలించేలా ఉన్నత విద్యామండలి అధికారులు సరికొత్త వెబ్సైట్ను అందుబాటులోకి తీసుకొచ్చారు.
15 వర్సిటీల్లోని విద్యార్థుల సర్టిఫికెట్లన్నింటినీ ఒకే సర్వర్లో పొందుపరిచారు. అభ్యర్థుల హాల్టికెట్ నంబర్లను ఎంటర్ చేస్తే సర్టిఫికెట్ అసలుదో.. నకిలీదో తెలుసుకునేలా ఏర్పాట్లుచేశారు. ఇటీవలికాలంలో విదేశీ వర్సిటీలు, కంపెనీలు ఎక్కువగా సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం వర్సిటీలకు దరఖాస్తు చేస్తున్నాయి. అవి దరఖాస్తుచేయడం, వర్సిటీలు వెరిఫికేషన్ చేయడం, లేఖ ద్వారా వర్సిటీలు సమాచారం పంపడం జరుగుతున్నది. ఈ వెబ్సైట్ అందుబాటులోకి వస్తే సులభతరమవుతుంది.
ప్రత్యేకతలు..
నకిలీ సర్టిఫికెట్ల స్వామిపై ఎల్వోసీ జారీ
హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 16(నమస్తే తెలంగాణ): నకిలీ సర్టిఫికెట్లతో అమెరికా వెళ్లి, అక్కడి నుంచే హైదరాబాద్లోని పలువురికి నకిలీ సర్టిఫికెట్లు పంపిస్తున్న ముద్దం స్వామిపై లుక్ అవుట్ సర్కిల్ (ఎల్వోసీ) జారీ చేసేందుకు నాచారం పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ముద్దం స్వామి తన వద్ద రూ.1.3 లక్షలు తీసుకొని, నకిలీ సర్టిఫికెట్ ఇచ్చాడని నాచారానికి చెందిన జంగ దయాకర్రెడ్డి ఎల్బీనగర్ ఎస్వోటీ పోలీసులకు వెల్లడించారు.
ఈ నేపథ్యంలో పోలీసులు ఎల్వోసీ జారీపై దృష్టి సారించారు. కేసు విచారణ నిమిత్తం ముద్దం స్వామిని హైదరాబాద్ రప్పించడానికి ఎల్వోసీ జారీ కీలకం కానున్నది. ముద్దం స్వామిపై గతంలోనే ఉస్మానియావర్సిటీ పోలీస్స్టేషన్లో నకిలీ సర్టిఫికెట్ కేసు నమోదవ్వడం, ఆ కేసు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్)కు బదిలీ కావడంతో అప్పట్లోనే హైదరాబాద్ పోలీసులు ఎల్వోసీ జారీ చేశారు. ఓయూలో హోటల్ మేనేజ్మెంట్ అండ్ క్యాటరింగ్ కోర్సు చేసినట్టుగా నకిలీ సర్టిఫికెట్ పొంది.. 2021లోనే అమెరికా వెళ్లిన ముద్దం స్వామి.. హైదరాబాద్లోని పలువురికి నకిలీ సర్టిఫికెట్లు పంపినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.
ఇతని ద్వారా సర్టిఫికెట్లు పొందినవారు విదేశాలకు కూడా వెళ్లి ఉండవచ్చనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ముద్దం స్వామి అమెరికా నుంచి ఇంటర్నెట్ కాల్స్ ద్వారా ఇక్కడివారితో మాట్లాడుతూ ఓలా రైడర్స్ ద్వారా ఇంటి వద్దకే నకిలీ సర్టిఫికెట్లు పంపిస్తున్నాడని పోలీసులు భావిస్తున్నారు. ముద్దం స్వామి స్వయంగా నకిలీ సర్టిఫికెట్లు తయారు చేస్తున్నాడా? లేక ఏదైనా ముఠాకు దళారీగా వ్యవహరిస్తున్నాడా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.