నిజామాబాద్, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): మనసులో లేనిది బలవంతంగా రుద్దితే రాదు. అణగారిన వర్గాల మీద బీజేపీ కురిపించే ప్రేమ అలాంటిదే. ఇటీవల హైదరాబాద్ పర్యటనకు వచ్చిన కేంద్ర హోంమంత్రి అమిత్షా దళిత కార్యకర్త ఇంట పచ్చి మంచినీళ్లు కూడా ముట్టలేదు. భోజనం చేస్తారని ప్రకటించినా.. చివరకు ఇంట్లో చేసిన చాయ్ని కూడా రుచిచూడలేదు. బయటినుంచి బ్లాక్టీ తెప్పించుకుని తాగడం విమర్శలకు దారితీసింది.
అయినా బీజేపీ నేతల తీరు మారలేదు. తాజాగా కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ దళిత కార్యకర్త ఇంట అల్పాహారం చేసేందుకు వచ్చి, అదే డ్రామా రిపీట్ చేశారు. ఇడ్లీ, వడ, ఉప్మా బయటినుంచి హాట్బాక్సుల్లో తెప్పించుకున్నారు. ఆ టిఫిన్స్ను పింగాణీ ప్లేట్లల్లో పెట్టుకుని తిన్నారు. కేంద్రమంత్రి తీరుపై దళితనేతలు, నెటిజన్లు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ముమ్మాటికీ ఇది వివక్షేనని. దళితులపై లేని ప్రేమను ఎందుకు బలవంతంగా ప్రదర్శిస్తున్నారని వారు మండిపడుతున్నారు.
మూడురోజులుగా నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో పర్యటిస్తున్న కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ శనివారం ఉదయం కోటగిరి మండలంలోని కొడిచర్ల గ్రామానికి వెళ్లారు. అక్కడి దళితవాడలోని భీమయ్య అనే కార్యకర్త ఇంట్లో కేంద్రమంత్రి అల్పాహారానికి ఏర్పాట్లు చేశారు. భీమయ్య కుటుంబం తమ ఇంట్లోనే టిఫిన్ తయారు చేసేందుకు సిద్ధమైనప్పటికీ, నిర్మల అనుచరులు వద్దని వారించినట్టు తెలిసింది. వారి ఒత్తిడి మేరకు ప్రత్యేకంగా సమీపంలోని బోధన్ పట్టణం నుంచి ఇడ్లీ, వడ, ఉప్మాలను హాట్బాక్సుల్లో కొడిచర్లకు తీసుకువచ్చారు.
ఉదయం 8.20 గంటలకే టిఫిన్స్ అన్నీ కొడిచర్లలో సిద్ధం చేసిన తర్వాతనే కేంద్రమంత్రి ఆ గ్రామానికి బయల్దేరి వచ్చారు. భీమయ్య బాగోగులపై కేంద్ర మంత్రి ఆరా తీశారు. పార్టీలో ఎప్పటి నుంచి పని చేస్తున్నారంటూ వివరాలు అడిగారు. వారి ఆదాయ మార్గాలను అడిగి తెలుసుకున్నారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పింగాణీ ప్లేట్లలో నిర్మల టిఫిన్ తిన్నారు. రెండు ఇడ్లీలు, ఒక వడ, కొంత ఉప్మాను నిర్మల స్పూన్తో ఆరగించారు.
అనంతరం అక్కడినుంచి ఆమె బాన్సువాడ బయల్దేరి వెళ్లారు. నిర్మల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బయటినుంచి టిఫిన్స్ తెప్పించుకుని తినడం.. దళతుల ఇంట్లో భోజనం చేయడం ఎలా అవుతుందని వారు ప్రశ్నిస్తున్నారు. ఇది వివక్షకు తక్కువేమీ కాదని వారంటున్నారు. మరోవైపు, శుక్రవారం రాత్రి కోటగిరి మండలం జల్లాపల్లి లోని బీజేపీ నియోజకవర్గస్థాయి నాయకుడి ఫాంహౌస్లో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ బస చేశారు.
సదరు నాయకుడిపై నేరారోపణలు ఉన్నాయి. కుటుంబంలోని దగ్గరి బంధువులను మట్టు బెట్టిన కేసులో ముద్దాయిగానూ గతంలో ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఇతని ఇంట్లో నిర్మలా సీతారామన్ విడిది చేయడం వివాదాస్పదం అవుతున్నది.