పెద్దవంగర, నవంబర్ 17: ‘నీదేం పార్టీ.. ఇక్కడికొచ్చి సీఎం కేసీఆర్, మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, బీఆర్ఎస్ను విమర్శిస్తున్నావ్? నీకు వారి గురించి మాట్లాడే హక్కు లేదు’ అని ఓ గిరిజన మహిళ మాజీ ఐఏఎస్ ఆకునూరి మురళిని నిలదీసింది. జాగో తెలంగాణ ఓటరు చైతన్య యాత్రలో భాగంగా శుక్రవారం ఆకునూరి మురళి మహబూబాబాద్ జిల్లా పెద్దవంగరకు వచ్చారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్, మంత్రి దయాకర్రావును విమర్శిస్తూ మాట్లాడుతుండగా ధరావత్ బుజ్జమ్మ ఆయన్ని నిలదీసింది. ‘నీదేం పార్టీ? నువ్వు ఇక్కడ ఏం చేసినవ్? మాలాంటోళ్లకు కేసీఆర్ ప్రభుత్వం అన్ని కల్పిస్తున్నది.
బీఆర్ఎస్కు ఓట్లు వేయొద్దని ఎందుకు అంటావ్? అని ప్రశ్నించింది. మురళితోపాటు యాత్రకు వచ్చిన కొంతమంది పక్కనే ఉండి దయాకర్రావు దగ్గర డబ్బులు తీసుకొని వచ్చి మాట్లాడుతున్నావా? అంటూ మహిళను ప్రశ్నించారు. వారితో వచ్చిన వారు సదరు మహిళను అక్కడ నుంచి పంపిచే ప్రయత్నం చేస్తుండగా… ‘కేసీఆర్ను, దయాకర్రావును అంటుళ్లంటే.. మీరే పెద్ద దొంగలు’ అని ఎదురు తిరిగింది. స్థానికులు సైతం ఆ మహిళతో గొంతు కలిపారు. మాజీ ఐఏఎస్ అధికారి అయి ఉండి కూడా ఓటర్ల చైతన్య యాత్ర పేరుతో బీఆర్ఎస్, బీజేపీకి ఓట్లు వేయొద్దనడం, కల్వకుంట్ల కుటుంబాన్ని, బీజేపీని విమర్శించడం సిగ్గు చేటన్నారు. అలా మాట్లాడటం కంటే ప్రత్యక్షంగా కాంగ్రెస్ కండువా కప్పుకొని ఆ పార్టీకి ఓటు వేయండి అని ప్రచారం చేస్తే బాగుండేదని వారు మండిపడ్డారు. స్థానికులు నిలదీయడంతో మురళితో సహా బృంద సభ్యులు అక్కడి నుంచి వెళ్లిపోయారు.