మంచిర్యాల ఏసీసీ, ఆగస్టు 27: మంచిర్యాల జిల్లా అడవుల్లో మళ్లీ పులి కలకలం సృష్టించింది. కుశ్నపల్లి, నీల్వాయి అటవీ రేంజ్ పరిధిలో కాటేపల్లి, గొర్లపల్లి బీట్ అటవీ ప్రాంతంలో పులి మూడు రోజులుగా సంచరిస్తున్నట్టు అటవీ అధికారులు నిర్ధారణకు వచ్చారు. కాటేపల్లి బీట్ పెద్దవాగు పరిసరాల్లోని చిందమడుగు అటవీ ప్రాంతంలో ఆవుపై దాడి చేసింది. దీంతో అటవీ అధికారులు పులి జాడ కోసం అన్వేషిస్తున్నారు. పులి తిరిగే ప్రాంతంలో 62 సీసీ కెమెరాలను ఏర్పాటుచేశారు.
నీల్వాయి రేంజ్లో తిరుగుతున్నది కే-12 ఆడపులిగా అధికారులు గుర్తించినట్టు సమాచారం. దాదాపు ఏడాది క్రితం పెద్దపులి మనుషులపై దాడి చేసింది. దాంతో అక్కడున్న ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. ఇప్పుడు మళ్లీ పులి సంచరిస్తుండటంతో స్థానికులు వణికిపోతున్నారు.